CONCEPT

భావన

వ్యాసావళి

కుల గణన! మత గణన! వర్గ గణన!

ABN , Publish Date - Feb 14 , 2024 | 02:19 AM

‘కుల గణన విదేశీ శక్తుల ఎజండా?’ పేరుతో (ఫిబ్రవరి 3న) వచ్చిన కె. అరవిందరావు వ్యాసానికి ప్రతిస్పందన ఇది. ఆ వ్యాసంలో, ‘సంప్రదాయ మార్క్సిజం’, ‘సాంస్కృతిక మార్క్సిజం’, ‘రథయాత్ర’,...

‘కుల గణన విదేశీ శక్తుల ఎజండా?’ పేరుతో (ఫిబ్రవరి 3న) వచ్చిన కె. అరవిందరావు వ్యాసానికి ప్రతిస్పందన ఇది. ఆ వ్యాసంలో, ‘సంప్రదాయ మార్క్సిజం’, ‘సాంస్కృతిక మార్క్సిజం’, ‘రథయాత్ర’, ‘మండల్ కమిషన్ నివేదిక’, ‘హెయిర్ కటింగ్ రంగం’, ‘హిందూ సంస్కృతి’, ‘భారతీయ సంస్కృతి’ అంటూ అనేక విషయాల గురించి అవాస్తవాలు రాశారు, వ్యాసకర్త!

(1) మార్క్సిజంలో ‘సంప్రదాయ మార్క్సిజం’ అనీ, ‘సాంస్కృతిక మార్క్సిజం’ అనీ, తేడాలేమీ ఉండవు. మార్క్సూ, ఎంగెల్సులు, తమకు పూర్వం వున్న సిద్ధాంతాలను, విమర్శనాత్మకంగా పరిశీలించి రూపొందించిన ‘శ్రామికవర్గ పోరాట సిద్ధాంతం’ ఒక్కటే వుంటుంది. దానిని, వేరు వేరు దేశాలలో ఉన్న పరిస్థితులను బట్టి అన్వయించుకోవడం మాత్రమే జరిగింది. అది తప్ప, మార్క్సిజం చెప్పిన ‘శ్రమ దోపిడీ’ అనే సత్యాన్ని మించిన సత్యాన్ని, ఇప్పటివరకూ ఎవరూ కనిపెట్టలేదు.
(2) ‘గ్రామ్షీ’ వంటి కమ్యూనిస్టు మేధావులు కనిపెట్టారని వ్యాసకర్త చెపుతున్న ‘సాంస్కృతిక పెత్తందారీతనం’ (‘కల్చరల్ హెగిమొనీ’) అనే భావన, కొత్త సత్యమేమీ కాదు. ఆ పద ప్రయోగమే కొత్త! మార్క్సూ–ఎంగెల్సులు 1845లో రాసిన ‘జర్మన్ ఐడియాలజీ’లోనూ; 1848లో రాసిన ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లోనూ, ఆ భావన చాలా స్పష్టంగా ఉన్నదే. వాళ్ళ మాటలు చూడండి: ‘‘ప్రతీయుగంలోనూ, పాలించే భావాలు, ఆ నాటి పాలకవర్గ భావాలే’’– (కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక, పేజీ–66). ‘‘భౌతిక ఉత్పత్తి సాధనాలను తన అదుపులో కలిగివున్న వర్గమే, దాని ఫలితంగా బౌద్ధిక ఉత్పత్తి సాధనాలను కూడా కంట్రోల్ చేస్తుంది. బౌద్ధిక ఉత్పత్తి సాధనాలను కలిగివుండని వారి భావాలు, మొత్తం మీద, కంట్రోలు చేసే వర్గానికి లోబడివుంటాయి... పాలకవర్గ భావాలు అనేవి, ప్రబలంగా వున్న భౌతిక సంబంధాలకు ఖచ్చితమైన వ్యక్తీకరణ తప్ప ఇంకేమీ కాదు.’’ (జర్మన్ ఐడియాలజీ, పేజీ–67) మార్క్సూ, ఎంగెల్సులు చెప్పిన భావాన్నే, గ్రామ్షీ గానీ, ఇంకో కమ్యూనిస్టు గానీ చెప్పగలిగారు గానీ, వర్గాతీతమైన భావాన్నయితే చెప్పలేదు! కాబట్టి, ‘సంప్రదాయ మార్క్సిజం’ అనీ, ‘సాంస్కృతిక మార్క్సిజం’ అని వేరే వేరే పేర్లు పెట్టినంత మాత్రాన, మార్క్సిజపు సారాంశం మారదు.
(3) ‘‘అనేక దేశాల్లో ఆర్థిక అసమానతలున్నా, వర్గ పోరాటాలు జరగలేదు.’’– అని వ్యాసకర్త వ్యాఖ్య! అవి జరగలేదంటే, అది మార్క్సిజంలో లోపం కాదు. వర్గ పోరాటాలు అనేవి, పగలూ–రాత్రీ లా, అమావాస్యా– పౌర్ణమీలా, ప్రకృతి సహజంగా జరగవు! వర్గ పోరాటాల కోసం, శ్రామికవర్గ పార్టీలైన కమ్యూనిస్టు పార్టీలకు, మార్క్సిస్టు సిద్ధాంత గ్య్నానంతో, నడిచే సామర్ధ్యాలు బలహీనపడి ఉండవచ్చు! అలా జరగలేదు కాబట్టి, ‘సాంస్కృతిక మార్క్సిజం’ అనే భావన వచ్చిందనడం తప్పు! వర్గ పోరాటాలలోకి శ్రామిక జనాల్ని సమీకరించడానికి, కావలిసిన వర్గ చైతన్యం ప్రాధాన్యతను నొక్కి చెప్పే సందర్భంలో, గ్రామ్షీ ‘సాంస్కృతిక పెత్తనం’ అనే మాటని వాడాడు. సంస్కృతి అంటే భావజాలం. శ్రామిక జనాల మీద పాలక వర్గ సంస్కృతి పెత్తనాన్ని ఎదుర్కోవడానికి శ్రామిక వర్గ మేధావులు కృషి చెయ్యాలని చెప్పిన సందర్భం అది! ఈ భావన, మార్క్సూ ఎంగెల్సులు చెప్పని భావన కాదు. ఉదాహరణకి, సమాజానికి ఒక పునాదీ (ఆర్థిక సంబంధాలు), ఆ పునాదికి అనుగుణమైన, ఉపరితలం (సంస్కృతీ, రాజకీయాలూ, మతం మొదలైనవి) ఉంటాయని మార్క్సూ, ఎంగెల్సులు గతంలోనే చెప్పివున్నారు.
(4) ‘‘హిందూ మతం, కులాన్ని నిర్మించిందన్నది అసత్య ప్రచారం’’ అని వ్యాసకర్త వాదన. హిందూ మత గ్రంథాలలో నాలుగు వర్ణాల గురించే రాశారట గానీ, కులాల గురించి చెప్పలేదట! ఏ మతాల్లోనూ లేని ఆ వర్ణ వ్యవస్త హిందూ సమాజంలో మాత్రమే ఉందంటే, అది హిందూ మతానికి వున్న ప్రత్యేక లక్షణమే! వర్ణ వ్యవస్త మానవుల్ని ఎలా విభజించిందో చూడండి! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేవే ఆ నాలుగు వర్ణాలూ. ఇవన్నీ అసమాన వర్ణాలే! వాటిల్లోని అసమానత్వమే, అనేక వేల కులాలు ఏర్పడడానికి దారి తీసింది. అసలు గ్రహించవలిసింది: వర్ణ వ్యవస్తలో గానీ, కుల వ్యవస్తలో గానీ వున్నదంతా, అసమాన శ్రమ విభజనే! అసమాన శ్రమ విభజన అంటే, మానవుల్లో కొందరు ఎక్కువ విలువ గలిగిన మేధా శ్రమలూ; కొందరు తక్కువ విలువ గలిగిన శారీరక శ్రమలూ; కొందరు ఎప్పుడూ మురికిని శుభ్రం చేసే శ్రమలు చేయవలిసి రావడం, కొందరు ఆ రకం పనులు ఎప్పుడూ చెయ్యకపోవడం... ఇలాంటి పరిస్తితే అసమాన శ్రమ విభజన! అయితే, ఈ అసమాన శ్రమ విభజన అనేది, ప్రపంచ వ్యాప్తంగా, అన్ని మతాలలోనూ వున్నప్పటికీ, హిందూ మతం మాత్రమే వర్ణ వ్యవస్తని ఎందుకు కౌగలించుకుందో ఊహించుకోవలిసిందే! ఇప్పుడు మనం చెయ్యవలిసిందల్లా, కుల సంస్కృతిని చీదరించుకోవడమే! దాన్ని నిర్మూలించడమే!
(5) ‘ఈనాడు చాలా మంది కుల వృత్తులలో లేరనడానికి ఉదాహరణగా, క్షవరం చేసే వృత్తిలో ముస్లిములే చాలామంది వున్నారని వ్యాసకర్త వాదన. అంటే, హిందువుల్లో, కులవృత్తుల్లో వున్నవారు తగ్గిపోయారని, తేల్చే ప్రయత్నం! జనాభా లెక్కల్ని ఆధారం చేసుకుని, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక, 2018 డిసెంబరు 22న ఇచ్చిన వివరాల ప్రకారం, కులం అనేది ఇప్పటికీ, వృత్తుల్ని ఎంచుకోవడంలో, ప్రధానమైన అడ్డంకిగా వుంది–అని! ఉత్తరప్రదేశ్‌లో జనాభా లెక్కల ప్రకారం: తోలు పరిశ్రమల్లో (లెదర్ ఇండస్ట్రీస్) పనిచేసే 46 వేల మందిలో, 41 వేల మంది, ఎస్సీ కులస్తులే! అదే సమయంలో, రాజస్తాన్‌లో 76 వేల మంది స్వీపర్లుగా వుంటే, వారిలో 52 వేల మంది ఎస్సీలే!
(6) ‘అద్వానీ రథయాత్ర సమయంలో, వి.పి.సింగు ప్రభుత్వం మండల్ కమిటీ నివేదికను అమలు చేసిందని’ వ్యాసకర్త చేసిన వ్యాఖ్య వాస్తవ విరుద్ధం. ఆ నివేదికను వి.పి.సింగు పార్లమెంటులో ప్రవేశపెట్టినది, రథయాత్రకు పూర్వమే. 1990 ఆగస్టు 7న. రథయాత్ర ప్రకటన వచ్చింది ఒక నెల తర్వాత, సెప్టెంబరు 12న. ఎయిర్ కండిషనర్లు బిగించిన టొయాటో వ్యానుతో ‘రథయాత్ర’ మొదలైనది, సెప్టెంబరు 25న.
(7) కుల గణన వల్ల భారతీయ సంస్కృతీ మూలాలు నశించే అవకాశం వుంది–అని వ్యాసకర్త వాపోయారు. కుల వ్యవస్తను సృష్టించినదే హిందూ సంస్కృతి కాబట్టి, కుల గణన వలన భారతీయ సమాజానికి ఏమీ నష్టం జరగదు. ఎందుకంటే, కుల గణన కోరే వారి ఉద్దేశం, కులాల జనాభాని బట్టి ఆర్ధిక, రాజకీయ అవకాశాలు పొందాలి–అన్నదే! అందుచేత, కులాల నాయకులు ఇప్పుడున్న దోపిడీ రాజ్యాంగ యంత్రంలోనే, అధికారులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, పదవులకోసం ప్రయత్నిస్తారు. ఆ ప్రయోజనం కోసం, ఎల్లకాలమూ కులాలు నిలిచివుండేలా చూసుకుంటారు. నష్టం అంటూ జరిగితే, కులాల వారీగా కాకుండా, మతాల వారీగా, అది కూడా, మెజారిటీ మతస్తుల ఓట్లకోసం ప్రయత్నించే మతతత్వ రాజకీయ పార్టీలకి తలనొప్పే. మతతత్వవాద పార్టీలకు కావలిసింది ‘మత గణన’.
(8) ఈ కులగణనను మార్క్సిస్టులే వెనక వుండి రాజకీయ పార్టీల చేత చేయిస్తున్నారు – అని, వ్యాసం చివరిలో, వ్యాసకర్త అనుమానం! అది పూర్తిగా తప్పు. ఎందుకంటే, ‘శ్రమ దోపిడీ’ని శ్రామిక వర్గ పోరాటాల ద్వారా నిర్మూలిస్తూ, అసమాన శ్రమ విభజనను మార్చడం ద్వారా కుల వ్యవస్తను కూల్చే లక్ష్యం గల కమ్యూనిస్టులు, కుల గణన మీద భ్రమలు పెట్టుకోరు! ‘వర్గ గణన’ మీద ఆధారపడి, వారు తమ కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. అలాగే, ‘‘మనమంతా హిందువులం! మనమంతా బంధువులం!’’ అనే నినాదంతో, కుల గణనను వ్యతిరేకించే పార్టీలను నమ్మవద్దని కూడా శ్రామిక జనాలకు కమ్యూనిస్టులు వివరిస్తారు.
(9) ఆరెస్సెస్ వాళ్ళూ, బీజేపీ వాళ్ళూ తరుచుగా జపించే ‘భారతీయ సంస్కృతి’, ‘జాతీయ భావన’ అనే మాటలు, ఈ వ్యాసంలో కూడా కనిపించాయి. వాస్తవంలో, హిందూ మతస్తులందరూ, భారతీయ సమాజం అంతా, ఒకే రాయితో చేసిన శిల్పం కాదు. ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ, అన్ని సమాజాల్లోనూ, అన్ని మతాల్లోనూ వున్నట్టే, ఇక్కడా ధనిక–పేద తేడాలూ, స్త్రీ–పురుష అసమానత్వమూ, మూఢ నమ్మకాలూ, ఇలా అన్ని చెడుగులూ వున్నాయి. కుల వ్యవస్త అనేది, ఇక్కడ అదనంగా వున్న చెడ్డ లక్షణం! అన్ని దేశాలలోనూ వున్నట్టే, ఈ దేశంలోనూ, లాభాలూ, వడ్డీలూ, కౌళ్ళూ అనే ‘శ్రమ దోపిడీ’ ఆదాయాల మీద బ్రతికే సంస్కృతే, దోపిడీ వర్గానికి మూలం! ఏదో ఒక రకమైన శ్రమ చేస్తూ, జీతాల మీద బ్రతికే పేదల సంస్కృతీ వుంది. అలాంటప్పుడు భారతీయ సంస్కృతి, ఇతర దేశాల సంస్కృతి నించీ వేరుగా వుండదు.
(10) ‘‘కులగణన వల్ల ఎవరికి లాభం?’’ అని ప్రశ్నించిన వ్యాసకర్తకి, మత గణన వల్ల ఎవరికి లాభం? అని కూడా ప్రశ్నించాలని తోచలేదు. 2022లో, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, బీజేపీ రాజ‘యోగి’ (ముఖ్యమంత్రి), ‘ఈ ఎన్నికలు 80 శాతానికీ, 20 శాతానికీ మధ్య పోరాటం!’ అనడం, ‘మత గణన’ దృష్టితో కాదా? ఇలాంటి ప్రకటనలు, దేశ ప్రజల్ని కలిపి వుంచుతాయా, విభజిస్తాయా?
రంగనాయకమ్మ