5. వేమన - (1650 రాయలసీమ )
(సామ్య వాద ) భావవిప్లవం
తనకాలపు సామాజికనైనా చైతన్య దృష్టితో కవిత్వం చెప్పిన తొలి తెలుగు కవి వేమన్న. అదే దృష్టితో రచన చేస్తున్న ఈనాటి కవులు తమకన్నా పూర్వుల సంప్రదాయాన్ని తెలుసుకోవడం ఆరోగ్యకరమే గాక అవసరమని కూడా కోరుకుంటున్నాం. వెనకటి మంచిని జీర్ణించుకొని కొత్త పరిస్థితులను గుర్తించి ముందు చూపుతో రచనలు చేయటం ఈనాటి రచయితల కర్తవ్యం.
తన కాలాన్ని మించి కొన్ని విషయాల్లో ముందుకు చూడగలిగిన కవిగా వేమన్నను మనం గౌరవించాలి.
విగ్రహారాధనను వ్యతిరేకించాడు. శైవ వైష్ణవ మతాలవారి ఆర్భాటాలను, వారి దురాచారాలను, మోసాలను బట్టబయలు చేశాడు. చిలుక పలుకుల చదువులను విమర్శించాడు. కాకులకు పిండాలు పెట్టటం వంటి మూర్ఖాచారాలను తీవ్రంగా ఖండించాడు. శ్రమశక్తిలోనే సర్వమూ ఉన్నది అనేంత నిశిత పరిశీలన చెయ్యగలిగిన వేమన్న మామూలు కవి, తనకాలపు ఛత్రంలో ఇమడని గొప్ప కవి.
వేమన్న రచనా మార్గంలో మూడు అంశాలు గుర్తించవచ్చు.
1.ప్రజలభాషలో ప్రచారంగా ఉన్న పదాలను, మాండలికాలను ప్రయోగించి ప్రజలకు సన్నిహితమైన రచన చెయ్యటం. 2.చెప్పదలచుకున్న భావాన్ని తగిన విస్తీర్ణంలోనే క్లుప్తంగా చెప్పటం. 3.ఊహలోనుంచికాక జీవితం నుంచి ఉపమానాలను ఏరుకోవటం.
కవితా దృక్పథం విషయంలో మాత్రమే కాక రచనా విధానంలో కూడా వేమన్న ఆదర్శం నుంచి ఈనాటి కవులు నేర్చుకోవలసింది చాలా ఉందని దృఢంగా భావిస్తున్నాం.- చేకూరి రామారావు