G.వ్యాసావళి📕



ప్రశ్న : కమ్యూనిస్టు అయినంత మాత్రాన నాస్తికుడు కావాలా ? 'కమ్యూనిజం'కూ, నాస్తికత్వానికీ మధ్య ఉండే సంబంధం ఏమిటి ?? అంటే, కమ్యూనిస్టుకూ, నాస్తికుడికీ మధ్య తేడా ఏంటి ??
జ : ' నాస్తికుడు ' అంటే ఏమిటో ఎవరికైనా తేలిగ్గానే తెలుస్తుంది కదా ? ఈ ప్రకృతికి సృష్టి కర్త లేడు. అంటే.. "దేవుడు లేడు" అనే అవగాహనతో వుండేవాడే నాస్తికుడు కదా ? అలాగే, కమ్యూనిస్టు కూడా నాస్తికుడే.. ఎందుకంటే, కమ్యూనిస్టు సిద్ధాంతం కూడా సృష్టి కర్తని అంగీకరించని భౌతిక వాద సిద్ధాంతమే. అలాంటి సిద్ధాంతాన్ని అంగీకరించే వ్యక్తి భౌతిక వాదిగానే వుండాలి కదా ? కాబట్టి ఆ రకంగా, కమ్యూనిస్టు అనేవాడు
కూడా నాస్తికుడే. 

ఎవరైనా ఒక వ్యక్తి "నేను కమ్యూనిస్టుని" అని చెప్పుకుంటూ కూడా, దేవుడి నమ్మకాలతో వుంటే, అది అతని తప్పు. "అతను ఆ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని భౌతిక వాదంగా అర్ధం చేసుకోలేదన్న మాట !"

దేవుణ్ణి నమ్మే వ్యక్తి నాస్తికుడు కానట్టే.. దేవుణ్ణి నమ్మే వ్యక్తి కూడా కమ్యూనిస్టు కాలేడు. "నాస్తికుడు" అన్నా , "కమ్యూనిస్టు" అన్నా వాళ్ళు ఖచ్చితంగా భౌతిక వాదులుగానే ఉండాలి.

"నువ్వు ఇలాగే వుండాలి" అని వాళ్ళని ఎవరూ ఆజ్ఞాపించరు. ప్రకృతిని అర్ధం చేసు కోవడంలో వాళ్ళ అవగాహన ఎలా వుంటుందో దాన్ని బట్టే వాళ్ళు భక్తులు గానో, నాస్తికులుగానో వుంటారు. 

భౌతిక దృక్పధం గల వాళ్ళందరూ నాస్తికులే. అయితే, నాస్తికుడికీ కమ్యూనిస్టుకీ తేడా ఏమిటంటే.. "ప్రధానంగా వాళ్ళు సమాజాన్ని అర్ధం చేసుకునే విషయం" లోనే ఉంటుంది. 

నాస్తికులు ఎంత సేపూ "ప్రకృతి విషయాలే మాట్లాడతారు" . సమాజాని కంతటికీ మూలం అయిన "శ్రమ సంబంధాల గురించి అస్సలు పట్టించుకోరు. అంటే.. "శ్రమ దోపిడి"నీ, వర్గ భేదాల్నీ పట్టించుకోరన్న మాట — తెలిసి గానీ, తెలియక గానీ..

కమ్యూనిస్టులు అయితే , "ప్రకృతి విషయాలనే గాక, సమాజ విషయాల్ని కూడా భౌతిక దృష్టితోటే చూస్తారు" . ఇదే ఆ రెండు రకాలకూ తేడా ! 

"ప్రకృతి విషయంలో అయితే, ఇద్దరూ భౌతిక వాదులే". సమా జాన్ని (మానవ సంబంధాల్ని) అర్ధం చేసుకోవడంలో మాత్రం తేడా వుంటుంది. 

"కమ్యూనిస్టు అనే వాడు నాస్తికుడిగా వుండాలా ?" అని కదా మీ అసలు ప్రశ్న ? - "అవునండీ, వుండాలి" అనేది నా జవాబు. ఎందుకంటే, కమ్యూనిజం అనేది భౌతిక వాదమే గనక.

అన్ని కోణాలలోనూ భౌతిక వాదిగా వుంటేనే అతను అసలైన కమ్యూనిస్టు ! 

"వైద్యాన్ని నమ్మకుండా మంత్రాలూ తంత్రాలూ నమ్మే వ్యక్తి వైద్యుడు అవుతాడా ?" అలాగే, "అతీత శక్తుల్ని నమ్మే వ్యక్తి కూడా కమ్యూనిస్టు కాలేడు". గతి తార్కిక భౌతిక వాద దృక్పధం వున్న వ్యక్తే కమ్యూనిస్టు ఔతాడు. భౌతిక వాదంలో భగవంతుడికి స్థానం లేదు, ఉండదు.
   --- రంగనాయకమ్మ🙏
✳️✳️✳️✳️
కుల గణన! మత గణన! వర్గ గణన!

రంగనాయకమ్మ
CONCEPT ( development of human relations and human resources )
సమస్య వెంటే పరిష్కారం! - రంగనాయకమ్మ
రంగనాయకమ్మ
సమాజంలో ఉన్న ప్రతీ మనిషీ శ్రమ చెయ్యాలని గ్రహించడమూ; ప్రతి మనిషీ శారీరక - మేధా శ్రమలు రెండూ చెయ్యాలని గ్రహించడమూ, మొదటి సంగతి. ఆ మార్పుల కోసం, శ్రామిక వర్గ పోరాటం అత్యవసరమని గ్రహించడం, మరో సంగతి. ఏ గ్రహింపూ లేకుండా, ‘కుల విధానాన్ని  తక్షణం నిర్మూలించాలి’ అంటూ అరిచే నినాదాలు ఆ నిర్మూలనకు ఏ మాత్రమూ పనికి రావు. పైగా ఆ శబ్దాలు, సిద్ధాంత శబ్ద కాలుష్యాన్ని మాత్రమే దట్టంగా సృష్టిస్తాయి.
‘కులాల విధానం’ అనే సమస్యకి పరిష్కారం, కులాంతర వివాహాలే. కుల విధానాన్ని అంగీకరించని వారందరూ గ్రహించవలసింది ఇదే. 

సమస్య ఉంటే, దాని వెంటే పరిష్కారం ఉంటుంది. సమస్య వల్ల బాధపడే వాళ్ళకి పరిష్కారం తెలియలేదంటే సమస్యే తెలియలేదని అర్థం.
కుల విధానం పుట్టుక గురించి మాట్లాడే వారు కొందరు, ‘చాతుర్వర్ణాలు’ అనే పేరుతో ‘బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర’ అంటూ మొదలు పెడతారు. అలా మొదలు పెట్టి, ఆ నాలుగు వర్ణాలూ, ఏ శ్రమల తోటీ, ఏ వృత్తుల తోటీ సంబంధాలు లేకుండా పుట్టుకొచ్చినట్టు చెప్పుకొస్తారు. ప్రతీ వర్ణమూ అనేక విభాగాలుగా వేరు వేరు వృత్తుల్లో నిమగ్నమై ఉండడమూ; ‘శూద్రులు’ అనే వర్ణం, అనేకానేక శారీరక శ్రమలు చేసే వృత్తులు గానూ, ప్రతీ వృత్తీ ఒక కులం గానూ ఏర్పరడమూ; ఇవన్నీ సమాజంలో స్పష్టంగా కనపడుతూ ఉన్నవే.

బట్టలు ఉతికే వృత్తి ఒక కులం. క్షవరాలు చేసే వృత్తి ఇంకో కులం. చేపలు పట్టే వృత్తి మరో కులం. నేతా, కుట్టూ, వేరు వేరు కులాలే. వృత్తులు మారినా, కలిసినా, కులాలు నిలబడే ఉండడం సంప్రదాయంగా సాగుతోంది. ఒక వృత్తినీ, దాని కులం పేరునీ చూస్తే, వృత్తి మొదటిదో, కులం మొదటిదో, తేలికగానే గ్రహించవచ్చు. శ్రమలే లేని కాలంలో వృత్తులు ఉండవు. వృత్తులే లేని కాలంలో, దానికి కులం పేరు ఏర్పడదు. 

ఒక కులం గల కుటుంబంలో ఒక పెళ్ళి జరగాలంటే, అదే కులం గల, అంటే అదే వృత్తి గల వ్యక్తే, ఆ కుటుంబంలోకి రావడం జరుగుతోంది. వివాహ సంబంధాలు ఏ కులానికి ఆ కులంలోనే ఏర్పడాలి - అనే సంప్రదాయానికి మూల కారణం, ‘ఒకే రకం వృత్తి’ అనేదే. అంటే, వృత్తిని బట్టే కులం. కులాన్ని బట్టే వివాహ సంప్రదాయం. అంటే, కులాలు పోవాలంటే, వృత్తుల విధానంలో పెద్ద మార్పు జరగాలని అర్థం.

‘కులాలు’ అన్నప్పుడు, అవి కేవలం వేరు వేరు భిన్న వృత్తులు మాత్రమే కాదు; ఆ వృత్తులకూ, వాటిని బట్టి ఆ కులాలకూ, చిన్నా - పెద్దా గుర్తింపులు కూడా ఏర్పడ్డాయి. అయితే, ‘వృత్తులు అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. ఈ కుల విధానం ఈ దేశంలోనే ఎందుకు ఉంది?’ అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రశ్నలు ఎప్పుడూ మంచివి. కారణాల్ని గ్రహించాలనే ప్రయత్నాలు అవి. ఇతర దేశాల్లో ఉన్న వేరు వేరు చెత్త సంప్రదాయాలు ఈ దేశంలో లేవు. ఒక దేశంలో ఉన ్న మంచిగానీ చెడ్డగానీ, అదే రకంగా ప్రతీ చోటా ఉండడం లేదు. ఇక్కడి చెడ్డని మించిన చెడ్డ, అక్కడ ఉండవచ్చు. అక్కడి మంచిని మించిన మంచి, ఇక్కడ ఉండవచ్చు. ‘ఇక్కడ ఉన్నది అక్కడ లే దేం?’ ప్రశ్నకి జవాబు, ‘‘అక్కడ ఉన్నది ఇక్కడ లేదేం?’’ అనేదే.    మన దగ్గిర ఉన్నది చెడ్డే అని తెలిస్తే, దాన్ని మనం మార్చుకోవాలి ‘కుల విధానం’ పోవలిసిందే. కానీ ఎలాగ? పరిష్కారం కావాలంటే, సమస్యని సరిగా అర్థం చేసుకోవాలి.

ఇద్దరు వేరు వేరు కులాల వాళ్ళు స్నేహంగా ఉన్నా, ఆ కులాలు పోయినట్టు కాదు. ఆ ఇద్దరూ రోజూ కలిసి భోజనాలు చేస్తూ ఉన్నా, ఆ కులాలు పోయినట్టు కాదు. కాలేజీల్లో, స్నేహాలూ, హోటళ్ళలో పక్కపక్కనే కూర్చుని భోజనాలూ, ఇవన్నీ సాగుతూనే ఉన్నాయి. అయినా కులాలు కులాల్లాగే ఉంటున్నాయి.
ఇద్దరు చిన్నా పెద్దా కులాల స్ర్తీ పురుషులు, రహస్య సంబంధాలతో ఉంటే, కులాలు పోయినట్లు కాదు. ఆ సీ్త్ర పురుషులు బహిరంగంగా, పెళ్ళి తంతు ఉన్నా లేకపోయినా, భార్యాభర్తలుగా, కుటుంబ సంబంధాలతోనే, పిల్లలకు తల్లిదండ్రులు గానే, కలిసి జీవిస్తూ ఉంటే, అటువంటి సంబంధంలో బైల్దేరే పిల్లలకు ఏ కులాలూ లెక్కలోకి రావు. కానీ, రిజర్వేషన్‌ పద్ధతి సాగుతూనే ఉంటే, తండ్రి కులమో, తల్లి కులమో, ఏది చిన్న కులమైతే అది, ఆ పిల్లలకు కూడా చుట్టుకుంటుంది. తల్లి దండ్రులు కులాంతర వివాహం చేసుకున్నా, రిజర్వేషన్ల ద్వారా, పిల్లల తరానికి కూడా చిన్న కులాలు నిలిచిపోతాయి!

కులాంతర వివాహాలు, నూటికొకటో కోటి కొకటో జరగడం గాక, నిరభ్యంతరంగా జరిగే మార్గం ఏది? ఆ మార్గం ఏమిటో తెలుసుకోవాలంటే, కనీసం 100 కులాంతర వివాహాల్ని పరిశీలించి చూడాలి. ఈ పరిశీలనలో, రెడ్డి యువతికి మాల యువకుడితో పెళ్ళీ; బ్రాహ్మణ యువతికి, మాదిగ యువకుడితో పెళ్ళీ; వైశ్య యువకుడికి, మంగలి యువతితో పెళ్ళీ; ఇలా ఆ 100 పెళ్ళిళ్ళూ చిన్నా పెద్దా కులాల మధ్య జరగడం కనపడతాయి. అందులో కారణాల కోసం వెతికితే, చిన్న కులాల వ్యక్తులకు, వారి కుల వృత్తులు మారిపోవడమే కనపడుతుంది. ఒక బ్రాహ్మణ యువతికీ, ఒక టీచరుగా 
ఉన ్న మంగలి యువకుడికీ పెళ్ళి జరిగిందంటే, ఆ చిన్న కులం యువకుడికి విద్యా స్థాయి పెరిగి, తన కుల వృత్తి వదిలి, పై స్థాయి ఉద్యోగిగా మారడమే, పెద్ద కులం యువతితో పరిచయం, చివరికి పెళ్ళికి అంగీకారం!

చిన్న కులాల వ్యక్తులు, తమ కుల వృత్తుల్ని వదిలి వేస్తే, అప్పుడు సమాజానికి ఆ వృత్తులతో అవసరం ఎలా తీరుతుంది? ఈ నాడైతే, చిన్న కులాల్లో ఇంకా కుల వృత్తుల్ని వదలని వాళ్ళ ద్వారానే, సమాజ అవసరాలు తీరుతున్నాయి. కానీ, ఒక క్షవరాల కులంలో అందరూ కుల వృత్తిని వదిలేస్తే, అప్పుడేమవుతుంది? - సమాజానికి అవసరమైన ప్రతీ శ్రమనీ నిలబెట్టుకునే కొత్త విధానాన్ని మార్క్సిజం చెపుతుంది. చిన్నా - పెద్దా వృత్తులుగా సాగుతూ ఉన్న శ్రమ విభజనని, ‘సమానత్వ శ్రమ విభజన’గా మార్చాలనేదే ఆ కొత్త విధానం. కొత్త విధానమే లేకపోతే, అట్టడుగు శ్రమలు చేసే కులాలకు విముక్తి ఎలాగ?

ఈనాడు, చిన్న కులాల కుటుంబాల్లో మార్పులు, రిజర్వేషన్ల ద్వారా జరగడం నిజమే. కానీ ఆ మార్పు, ఆ కులాల జనాభాలో అత్యల్ప సంఖ్యకి మాత్రమే దొరుకుతుంది. రిజర్వేషన్లలోనే క్రీమీ లేయర్‌ పద్ధతిని ప్రవేశపెడితే, ఆ రకమైన మేలు కూడా ఎక్కువ జనాభాకి అందదు. భారత దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పేర్లతో ఉన్న మొత్తం జనాభాని చూస్తే, ఆ సంఖ్యలో మెజారిటీకి రిజర్వేషన్ల ద్వారా జరిగే మేలేమీ ఉండదు. పెద్ద కులాల పేదల్లో జరిగినట్టే చిన్న కులాల్లో కూడా, పరిశ్రమల్లో ఉద్యోగాలూ జీతాలూ సంపాదిస్తూ ఎదగడం అంటే, భూస్వాముల కిందా పెట్టుబడిదారుల కిందా వేతన బానిసలుగా బతకడమే. అదే ఆ ఎదుగుదలకి అర్థం! ఈనాడు కూడా, అనేక పరిశ్రమల్లో పని పనిచేసే ఇంజనీర్ల వంటి ఉద్యోగులకు కూడా, రోజుకి 16 గంటల పని, తప్పనిసరి నియమం!
ఒక చిన్న కులస్తుడు, పెట్టుబడిదారుడిగా ఎదిగి, లేదా రిజర్వేషన్ల మార్గం ద్వారా ప్రభుత్వంలో మంత్రిగా మారి, స్వంత భవనాలతో, స్వంత పెట్టుబడులతో ఎదిగిపోయినప్పుడు, తన పిల్లల వివాహాల కోసం, తన కులంలోనే పేదల వేపు చూడడు. పెద్ద కులాల్లో పేదల వేపు కూడా చూడడు. తనతో సమాన ఆర్థిక స్థాయి గల సంబంధాల కోసమే చూస్తాడు. పెద్ద కులాల వాళ్ళయినా చేసేది అక్షరాలా అదే. అంటే, యజమాని వర్గంగా ఎదిగిన ఆ చిన్నా - పెద్దా కులాల వాళ్ళకి, కులాల దృష్టి పోయి, యజమానుల వర్గ దృష్టే ప్రధాన దృష్టి అవుతుంది.
రాబోయే కాలం అంతా ప్రైవేటు పరిశ్రమల కాలమే. శ్రామికులు ఏ కులాల వారైనా, వారి డిగ్రీల గురించీ, జీతాల గురించీ, నిర్ణయాలన్నీ పారిశ్రామికవేత్తల ఇష్టాయిష్టాలే. అప్పుడు చిన్న కులాల్లో అల్పసంఖ్యని కూడా రిజర్వేషన్లు రక్షించలేవు. నిత్యం బానిస బతుకులూ, నిరుద్యోగాలూ, అడుగు స్థాయి వృత్తులూ, కులాల స్తిరత్వాలూ, అన్నీ వెనకడుగులే.
పెద్ద కులాల్లో అయినా, చిన్న కులాల్లో అయినా, అత్యధిక జనం శ్రామికులే. అందరూ తమ కులాల్ని గురించే తలపోస్తూ, కుల సంఘాలు పెట్టుకుంటూ, ‘కుల విధానాన్నే’ మరింత స్థిరంగా నిలబెట్టుకుంటున్నారు. చిన్న కులాల వారు రిజర్వేషన్ల భ్రమలతో, తమ కులాలే తమకు శాశ్విత రక్షణ అనుకుంటున్నారు. తాము ఏ వర్గ సంబంధాల్లో, ఏ స్తితిలో ఉన్నారో, గ్ర హించడం లేదు. రిజర్వేషన్లని ఉపయోగించుకుంటూ కూడా వర్గ స్పృహతో ఉండాలని గ్రహించడం లేదు. .
చిన్న కులాల జనాభాకి తాము ఘోరమైన ‘శ్రమ దోపిడీ’కి గురి అవుతున్నామని తెలీదు. దాని వల్ల దోపిడీ శ్రమ - విభజనలో చిక్కి ఉన్నామనీ తెలీదు. పిల్లి నోటిలో చిక్కిన ఎలక కూడా ఆత్మరక్షణ కోసం పెనుగులాడుతుంది. ఆ మాత్రపు రక్షణ స్పృహ కూడా శ్రామిక జనాభాకి లేదు.
కుల విధానమే కాదు. ఇంకా ఉన్న ఏ చెడ్డ విధానం అయినా గతించేది ఎవరి ద్వారా? సమస్య ఎవరిదో వారి ద్వారా.
మేధావులు బైల్దేరి, ‘కుల విధానం తక్షణం నశించాలి. దాన్ని వెంటనే తీసివెయ్యాలి’ అని ఘోషిస్తారు. దారి మధ్యలో ఉన్న ముళ్ళపొదని తక్షణం తవ్వి పైకి లాగి దాన్ని దారికి దూరంగా విసిరెయ్యడం ఎంత సాధ్యమో, కుల విధానాన్ని తీసివెయ్యడం అంత సాధ్యం అనుకుంటారు.
‘‘ఏ పెద్ద కులం వ్యక్తి అయినా, చిన్న కులం వ్యక్తినే పెళ్ళి చేసుకోవాలి’ అని చట్టం చెయ్యడం సాధ్యం కాదు. అలాంటి చట్టమే ఉంటే, పెద్ద కులాల వాళ్ళు పెళ్ళిళ్ళే మానుకుంటారు. పెళ్ళిళ్ళు లేని విధానాన్ని పెద్ద కులాల మధ్యనే పాటిస్తారు.
కులాంతరాల భార్యాభర్తలు, తమ పిల్లలకి తామే ఏదో ఒక కులాన్ని అంటగట్టడం తప్పకపోతే, కుల నిర్మూలన మాట ఎత్తడం దండగ.
సమాజంలో ఉన్న ప్రతీ మనిషీ శ్రమ చెయ్యాలని గ్రహించడమూ; ప్రతీ మనిషీ శారీరక - మేధా శ్రమలు రెండూ చెయ్యాలని గ్రహించడమూ, మొదటి సంగతి. ఆ మార్పుల కోసం, శ్రామిక వర్గ పోరాటం అత్యవసరమని గ్రహించడం, మరో సంగతి.
ఏ గ్రహింపూ లేకుండా, ‘కుల విధానాన్ని తక్షణం నిర్మూలించాలి’ అంటూ అరిచే నినాదాలు ఆ నిర్మూలనకు ఏ మాత్రమూ పనికి రావు. పైగా ఆ శబ్దాలు, సిద్ధాంత శబ్ద కాలుష్యాన్ని మాత్రమే దట్టంగా సృష్టిస్తాయి.
రంగనాయకమ్మ

తనకాలపు పరిధిలోనైనా సామాజిక చైతన్య దృష్టితో కవిత్వం చెప్పిన తొలి తెలుగు కవి వేమన్న. అదే దృష్టితో రచన చేస్తున్న ఈనాటి కవులు తమకన్నా పూర్వుల సంప్రదాయాన్ని తెలుసుకోటం ఆరోగ్యకరమే గాక అవసరమని కూడా భావిస్తున్నాం. వెనకటి మంచిని జీర్ణించుకొని కొత్త పరిస్థితులను గుర్తించి ముందు చూపుతో రచనలు చేయటం ఈనాటి రచయితల కర్తవ్యం.
తన కాలాన్ని మించి కొన్ని విషయాల్లో ముందుకు చూడగలిగిన కవిగా వేమన్నను మనం గౌరవించాలి. విగ్రహారాధనను వ్యతిరేకించాడు. శైవ వైష్ణవ మతాలవారి ఆర్భాటాలను, వారి దురాచారాలను, మోసాలను బట్టబయలు చేశాడు. చిలుక పలుకుల చదువులను విమర్శించాడు. కాకులకు పిండాలు పెట్టటం వంటి మూర్ఖాచారాలను తీవ్రంగా ఖండించాడు. శ్రమశక్తిలోనే సర్వమూ ఉన్నది అనేంత నిశిత పరిశీలన చెయ్యగలిగిన వేమన్న మామూలు కవికాడు, తనకాలపు చట్రంలో ఇమడని గొప్ప కవి.
వేమన్న రచనా మార్గంలో మూడు అంశాలు గుర్తించవచ్చు. 1.ప్రజలభాషలో ప్రచారంగా ఉన్న పదాలను, మాండలికాలను ప్రయోగించి ప్రజలకు సన్నిహితమైన రచన చెయ్యటం. 2.చెప్పదలచుకున్న భావాన్ని తగిన విస్తీర్ణంలోనే క్లుప్తంగా చెప్పటం. 3.ఊహలోనుంచికాక జీవితం నుంచి ఉపమానాలను ఏరుకోవటం. కవితా దృక్పథం విషయంలో మాత్రమే కాక రచనా విధానంలో కూడా వేమన్న ఆదర్శం నుంచి ఈనాటి కవులు నేర్చుకోవలసింది చాలా ఉందని దృఢంగా భావిస్తున్నాం.
చేకూరి రామారావు
CONCEPT ( development of human relations and human resources )

L.సాహిత్యం - చర్చ📕


సాహిత్యం - చర్చ
మహాభారతంలో లేనిదేదీ లేదని అంటారు.
ధర్మేచా ర్ధేచ కామేచ మోక్షేచ భరతర్షభ
యదితిహాస్తి తదన్యత్ర యాన్నేహాస్తి నతత్క్వచిత్.
తిక్కన గారుఈ శ్లోకాన్న్ని తెలుగులో చక్కని తేటగీతంగా చెప్పారు.
“అమల ధర్మార్థ కామ మోక్షముల గురిచి,
యొలయు తెరువెద్దియును నిందు గలుగునదియు,
యొండెడల గల్గు దీనలేకుండ చొప్పు,
దక్కొకంటను లేదు వేదజ్ఞులార,”

ప్రాణంబులు విడిచియును కృ
పాణాదులు విడువకున్న భటులారయ స
ప్రాణులపోలెం బ్రథన
క్షోణికి దొడవగుచు నుంకి చూడుము కృష్ణా.
ఇదంతా నువ్వు దగ్గిర వుండి చేయించావని దెప్పుతూ,
అవయవములు రూపరగ గ్రవ్యాదభక్షి
తంబులై యుంకి కొన్ని శవంబు లువిద
లెంత సూచియు నవి కొందరెరుగజాల
రయ్యెదరు సూడు తమ బంధులగుట కృష్ణ,”
అని చెపుతుంది. ఆ తరువాత దుర్యోధనుని కళేబరము చూసిమూర్ఛిల్లుతుందిగాంధారి.
సేద తేరుకొనిదుర్యోధనుడుయుద్ధానికి పోబోయే ముందు తనదగ్గరికి వచ్చి జయసిద్ధికి దీవించమని అడిగితే, “…. ధర్మంబేతల ననూనమగు నిద్ధ మాతలకు నెట్లయిన సిద్ధమగు,” అన్నది గాంధారి. అంటేధర్మము ఎటు వుంటే అటే జయం అని చెప్పింది. గాంధారి మాటకు తిరుగు లేదు. నీకే జయమగు గాక అని వుంటే ఏమయ్యేదో తెలియదు. విపరీతమైన శోక బాధతోఆనాడు తను దుర్యోధనునితో చెప్పిన మాటలు తిరిగి కృష్ణుడికి చెప్పింది. కొడుకు చావుకన్న కోడలు పడే శోకబాధ ఎంత తీవ్రమైనదో చెప్పుతున్నదిఈ క్రింది పద్యంలో.
కొడుకు చావు కంటె కోడలి యడలున
పెరిగి శోకవహ్ని దరికొనంగ
అంతరంగ మిప్పుడగ్గల మెరియంగ
దొడగె దీనికేది తుది యుపేంద్ర.
అట్లాగే దుశ్శాసనుడి శవంఅభిమన్యుడి శవంకర్ణుడి కళేబరం చూసి విలపిస్తుంది.
” కాకులును గ్రద్దలును తిన్న గడుసు ద్రెస్సి
అపరపక్ష చతుర్దశి అమృతకరుని
కరణి నొప్పెడు కర్ణుని మొగంబుమీద
వనిత యందంద మోపెడు తన మొగంబు,”
అని కర్ణుని భార్య విలాపం కృష్ణుడికి చెపుతున్నది.ప్రారంభంలో అన్నానుస్త్రీపర్వంలో ఒకే శ్లోకాన్ని ఉదహరిస్తారని. ఇప్పుడు ఆ శ్లోకంఅదే భావం తిక్కన గారి తెలుగులోనూ చూద్దాం.
భూరిశ్రవుడనే రాజు చెయ్యి అర్జునుడు నరికివేశాడు. చెయ్యి తెగిపడివున్న వాడి తల విరుగగొట్టాడు సాత్యకి. ఆ భూరిశ్రవుడి భార్య యుద్ధానంతరం శ్మశానంలోభూరిశ్రవుడి శవందగ్గిర విలపిస్తూ అన్న మాటలు గాంధారి చెపుతున్నది.
ఈ శ్లోకాన్నిముమ్మటుడు తన కావ్య ప్రకాశ లోనుఆనందవర్ధనుడు ధ్వన్యాలోకంలోనుఒక రసం మరొక రసానికి అంగంగా ఎట్లా ఉపకరిస్తుందో చూపించడానికి ఉదాహరణగా చెప్తారు. ఇది చాలా ప్రసిద్ధికెక్కిన శ్లోకం.
అయం స రశనోత్కర్షీ పీనస్తన విమర్దనః
నాభ్యూరుజఘనస్పర్శీ నీవీవిస్రంసనః కరః.
భూరిశ్రవుడి భార్య అతని తెగిన చేతిని పట్టుకొని విలపిస్తూ అన్న మాటలు ఇవి.ఈ చెయ్యి నా వడ్డాణము లాగినదిఈ చెయ్యి నా చనుగవబొడ్డుమొలతొడలు మొదలైన దేహభాగాలని ముట్టుకున్నదిఅని భావం. స్త్రీ తన భర్తని గుర్తుకుతెచ్చుకొని విలపిస్తున్న సమయం.దీనిలో శృంగార రసం కరుణ రసం ఉన్నాయి.
ఈ శ్లోకాన్ని తిక్కన గారు చాలా వివరంగా అనువదించారుచూడండి.
మెలుపారగా బట్టి మొలనూలి మణులు గదల్చుచు దిగుచుచు దగులొనర్చు
చనుగవమీది కల్లన వచ్చి లలిత విమర్దనంబున లజ్జ మరల ద్రోచు
నాభి యూరులు జఘనము మెత్త మెత్తన యొత్తి ముదంబున నుల్ల మూంచు
ననయంబు తిన్నని యనువున గనయంబు ప్రిదులంగ మెలగి చొక్కదవ చేయునిక్కరంబు నెయ్యమెక్కింనేరంగ
దగిలి సంతతంబు తలచునట్టి
భంగిమెరయ కీడువరుపంగ గొనియాడ
వలతి నీరు సేయవలసె దీని.
ఇటువంటి చరిత్రగల గొప్ప చేతిని బూడిదపాలు చెయ్యవలసివచ్చిందే అని శోకంవిషాదం వెలిబుచ్చుతున్నది.ఈ విషాదం గాంధారికి దుర్భరమయ్యింది. ఆఖరుగా కృష్ణుడితో అంటున్న మాటలు చూడండి.
ధృతరాష్ట్ర పాండు భూపతుల కుమారులు తమలోన నీసున సమరమునకు
దొడగిన నీ వడ్డపడవైతి తగు చాలు మానుషుల్ కలిగియు మాననీయ
వాక్యుండవయ్యును శక్య సమస్త కార్యుండన పేర్కొనియును ఉపేక్ష
చేసితి కురు రాజు చెరుపన తిరిగితి నిఖిల రాజుల తదనీకములనునామ మడచి తెల్ల భూములు పాడయ్యె
నంతవట్టు ఫలము ననుభవింపు
మే పడంగ నిన్ను శాపానలజ్వాల
దగ్ధమూర్తి చేయుదాన వినుము.
నువ్వు ఈ యుద్ధాన్ని ఆపగల సమర్థుడివి. అయినా నీవు ఆ పని చెయ్యలేదు. అందుగ్గాను నేను నిన్ను శపిస్తున్నాను. కృష్ణుడినిఅతని యాదవ కులాన్నీదిక్కులేని చావు చస్తారని శపిస్తుందిగాంధారి.యుద్ధభూమియుద్ధానంతరం ఎలా ఉన్నదోవివరంగా చేసిన వర్ణనలుఅటు వ్యాసుడుఇటు తిక్కన గారుస్త్రీ నోటినుండి చెప్పించడం గుర్తించాలి. యుద్ధం తెచ్చే భీభత్సంతదుపరి వచ్చే శోకంబాధస్త్రీ హృదయానికి పట్టినట్లుపురుషులకు పట్టదు. అంటే పురుషులకు ఆ బాధ తెలియదని కాదు. ఆ భావాలు స్త్రీ వ్యక్త పరిచినట్లుగా పురుషుడు చెప్పలేడు. అర్థమయ్యే కొద్ది భాగాలూఆ భీభత్స వర్ణనలూకళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి.
ఈనాడు ప్రతిఒక్కరూ స్త్రీపర్వం క్షుణ్ణంగా చదవడం అవసరమనిపిస్తోంది.
--------------------------------------
భర్తృహరి సుభాషితము-

 కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వ్జలా
 నస్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః
 వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే 
క్షీయంతే-ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్‌ 

 తాత్పర్యము: మగవానికి భుజకీర్తులు, సూర్య చంద్రహారాధి ఆభరణాలు గాని, స్నానము చందన ధార్మము, శిరోజాలంకారము వంటివేవీ అలంకారములు కాజాలవు. శాస్త్ర జ్ఞాన సంస్కారము కలిగినవాక్కు మాత్రమే అలంకారముగా శోభించును. సర్వ మణిమయ ఆభరణభూషణములన్ని నశించిపోతాయి. వాగ్భూషణ ఒక్కటి మాత్రమే నశించని అలంకార భూషణము. అనగా పురుషునికి సద్వాక్కు మాత్రమే అలంకారమని భావన.

 పద్మాకరం దినకరో వికచం కరోతి చంద్రో వికాసయతి కైరవచక్రవాలమ్
 నాభ్యర్ధితో జలధరోపి జలం దదాతి సంతస్స్వయం పరహితే విహితాభియోగాః

 తామరలచే సూర్యుడు యాచింపబడకయే వానిని వికసింపజేయుచున్నాడు. కలువలచే చంద్రుడు యాచింపబడకయే వానిని వికసింపజేయుచున్నాడు. జనులచే మేఘుడు యాచింపబడకయే జలము గురిపించుచున్నాడు. గావున సుజనులు పరులు యాచింపకయే వారలకు సహాయము చేయుదురు.

 వయ మిహ సరితుష్టా వల్కలై స్త్వం దుకూలై స్సమ ఇవ పరితోషో నిర్విశేషో విశేషః
 సతు భవతు దరిద్రో యస్య తృష్ణా విశాలా మనసి చ పరితుష్టే కోర్ధవాన్ కో దరిద్రః

 ద్రవ్యాశ గలవానికి దారిద్ర్యము గాని మన స్సం తు ష్టి గలవానికి ద్రవ్య మక్కరలేదు.

చీమలమర్రి బృందావనరావు 

  చం.  అడరు నవాంబు ధారలు జటాటవిలోబడి విభ్రమించె వె
        ల్వడి చనుదెంచి రాలుగొని పక్ష్మములన్ వెడనిల్చి మోవిపై
        బడి కుచఘట్టనం జెదరి పాఱి రయంబున ముత్తరంగలన్
        మడుఁగులు వారి నాభి కెడమానక చొచ్చె ననుక్రమంబుగన్
ఈ పద్యం నన్నెచోడ మహారాజు రచించిన కుమార సంభవము అనే కావ్యం లోది. కాళిదాసు కుమారసంభవం ద్వారా కథ బాగా ప్రసిద్ధమైనదే. కానీ కావ్యం మాత్రం కాళిదాసు కావ్యానికి అనువాదం కాదు. వ్యాసభారతానికి కవిత్రయం చేసిన అనువాదం లాంటిది కాదు. అసలు అనువాదమే కాదు. స్వతంత్రంగా రాసిన చక్కని ప్రబంధం ఈ నన్నెచోడుని కుమార సంభవం. ఈ పద్యాన్ని గురించి మాట్లాడుకొనే ముందు కవిని గూర్చి కొంచెం ప్రస్తావన అవసరం.
ఎందుకంటే, నన్నెచోడునికి తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానమున్నది. అసలు 1909 వరకూ తెలుగు సాహిత్యంలో నన్నెచోడుడనే కవి ఒకడున్నాడనే సంగతే ఎవరికీ తెలియదు. ఇతర కవులెవ్వరూ నన్నెచోడుని గురించి గానీ, అతని కుమార సంభవ కావ్యం గురించి గానీ, పూర్వ కవి ప్రశంసల్లో గానీ మరెక్కడా గానీ ఒక్క ముక్క కూడా రాయలేదు. 1909లో మానవల్లి రామకృష్ణ కవి తాను సంపాదించిన కుమార సంభవాన్ని ప్రకటించేసరికి ఆంధ్ర సాహిత్యలోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది, సంతోషించింది గూడా. ఉలికిపాటు ఎందుకంటే నన్నెచోడుని కాలం క్రీ.శ. 940 అని మానవల్లి కవి చెప్పడం వల్ల. అంటే, మనం ఆదికవి అనుకుంటున్న నన్నయ భట్టు కన్నా రెండు వందలేండ్లు ముందువాడు అవుతాడన్నమాట. ఈ వాదం వల్ల నన్నయగారి ఆదికవి పీఠం కొంచెం కదిలింది. దీని మీద చర్చలూ, ఉపచర్చలూ, వాదోపవాదాలూ బాగానే జరిగాయి.
అయితే, నన్నెచోడుడు కూడా తనకు పూర్వపు తెలుగు కవుల నెవర్నీ పేర్కొనలేదు. చాలా వాదాల తర్వాత, శాసనాలు కొన్నింటి ఆధారంగా నన్నెచోడుడు నన్నయకు వంద సంవత్సరాల తర్వాతి వాడని నిశ్చయం చేశారు. ఇది ఎక్కువ మంది పండితుల ఆమోదం పొందింది గానీ వివాదం మటుకు పూర్తిగా సమసిపోలేదు. వచ్చిన చిక్కల్లా ఎక్కడంటే పరిశోధకులు గానీ, విమర్శకులు గానీ, వారి వారి ప్రొత్సాహకులూ అనుమోదకులూ వ్యతిరేకులతో సహా, కులాభిమాన దురభిమానాలకు అతీతులేమీ కాకపోవడం. ఇందువల్ల సాహిత్యేతర కారణాలు చర్చల్లోనూ, నిర్ణయాల్లోనూ ముఖ్యపాత్ర వహించడం జరుగుతున్నది. పోనిండి, కవి గారి కాలచర్చ చరిత్ర పరిశోధకులకే వదిలిపెడదాం. నా ఉద్దేశం ఈ వివాదాన్ని మీకు పరిచయం చేయడమే. మనం ఇక కేవలం పద్యం సంగతి చూసుకుందాం. నన్నెచోడుడు ఆదికవి అయినా కాకపోయినా తెలుగు కవిత్వాన్ని మార్గ కవిత, దేశి కవిత అని వింగడించిందీ, కవిత్వ స్వభావంలో వస్తు కవిత అనేదాన్ని మొదట పేర్కొన్నదీ ఆయనే. నన్నెచోడుడు చాలా గొప్ప కవి.
కుమార సంభవం కథ మనకు పరిచితమే. గిరిరాజ తనయ శివుణ్ణి ప్రేమించడమూ, ఆయన కోసం తపస్సు చేయడమూ, ఆ క్రమంలో మన్మథ దహనమూ, తరువాత శివ పార్వతులకు కళ్యాణం జరగడమూ, కుమారుడు (కుమార స్వామి) సంభవించడమూ,, కుమార సంభవానంతరం తారకాసుర సంహారమూ, ఇలా సాగిపోయే కథ ఇది.
శివుణ్ణి భర్తగా పొందగోరి పార్వతి హిమాచల శృంగాల మీద తపస్సు చేస్తున్నది. గౌరి పరమ సుకుమారి. గొప్ప సౌందర్యవతి. వయస్సులో వున్న కన్యక. మిక్కిలి నిష్ఠతో, శివారాధన తాత్పర్యంతో, నితాంత తపోవృత్తిలో నున్నది. ఆమె అవయవాల అందాలన్నీ వేరే వేరే చోట్ల ఇల్లడ పెట్టి వచ్చిందట. ‘అలకల పొల్పు తేటిగములందు, మదాలస యాన లీల హంసల కడ, వక్త్రభాతి జలజంబులపై…’ - ఇలా అన్నమాట. తపోచర్య వల్ల రోజుక్కొంచెం రోజుక్కొంచెం శుష్కిస్తున్న ఆమె శరీరం ఎలా ఉన్నదంటే ‘అర్ధనారిగా తన దేహము అభవుమేన నల్పమల్పము నంటించునట్ల వోలె వుందట. ఎంత చక్కటి ఊహ. ఇలా తపస్సు చేస్తూ వుండగా వర్షాకాలం వచ్చి తొలకరి వానలు కురవడం మొదలైన సందర్భం లోనిది పై పద్యం.
చక్కనమ్మ చిక్కినా అందమే గదా. ఆమె నిటారుగా కూర్చుని తపశ్చర్యలో వున్నది. వాన చినుకులు ముందు ఆమె తలపై పడ్డాయి. అక్కణ్ణుంచి జారి ఆమె కనురెప్పల పైకి వచ్చాయి. కనురెప్పల వెండ్రుకల మీద కొంచెం ఆగి, ఆమె మెత్తటి ఎర్రటి మోవి మీద పడి అక్కడ కాసేపు మజిలీ చేశాయి. అక్కణ్ణించి ఆమె ఉరోజాల మీద పడి ధారలై ప్రవాహ వేగం సంతరించుకున్నాయి. మూడు కాల్వలుగా పాయలు కట్టి ఆమె నాభీ దేశం వద్ద మడుగులు కట్టినై. ఇదీ, ఆ వానజడి అంచెలంచెలుగా చేసిన ప్రయాణపు అనుక్రమం.
అవి నవాంబు ధారలు, అంటే తొలకరి వానలు. మొదట ఆమె తల మీది కచపంక్తిపై పడ్డాయి. జటాటవిలో, అంటే తల వెండ్రుకల నుంచి ‘విభ్రమించి వెల్వడి చనుదెంచి పక్ష్మములన్ వెడనిల్చి’నాయి. పక్ష్మములు అంటే కనురెప్పల మీది వెంట్రుకలు. ఆ వాన చినుకులు కనురెప్పల మీద కొంతసేపు నిలిచి, ఆపైన ఆమె పెదాల మీదకి జారి పడ్డాయి. ఆమె అధరాల మీద నుంచి ‘కుచఘట్టనన్ చెదరి పాఱి’నవి. కనురెప్పలూ,మోవీ సున్నితాలు. వక్షాలు అలా కాదు కాబట్టి ‘ఘట్టనం జెదరి’ అంటే తాకిడికి ఆ చినుకులు చెదరి, చెదరిన రయంబున పారినవి. అక్కడ ఆ ప్రవాహం ‘ముత్తరంగలై’, మూడు ధారలైనవి. ఒక్కో కుచం మీద నుంచి ఒక్కో ధార కారితే రెండు ప్రవాహాలు కావాలి. లేదూ, రయఘట్టనం వలన అటూ ఇటూ చెదరితే నాలుగు ధారలు కావాలి. కానీ, మధ్యలోని రెండు ధారలు కలిసి ఒకే ధారగా మారి ముత్తరంగలైనాయి. ఈ మూడు ప్రవాహాలూ మడుగులు వారి, ఎడము ఆనక, అనుక్రమంబుగా నాభికి చొచ్చినవట. అందుకు నాభి వద్ద పెద్ద మడుగు అయింది. మన కవుల కవిసమయాల్లో నాభి లోతుగా ఉండటం అనేది స్త్రీ సౌందర్య సూచన. పెద్దన గారి వరూధిని ‘నతనాభి’.
ఇక్కడ ఒక చిన్న విషయం. స్త్రీ అంగాంగాలూ కొలతలూ వర్ణించడమనే చాపల్యం నుంచి ఏ కవీ తప్పించుకోలేక పోయినాడు. దౌర్భాగ్యం. అయితే అలాంటి వర్ణన స్త్రీ కైనా పురుషుడికైనా ప్రతీసారి తప్పే అనలేం కూడానూ. శృంగారాత్మక సన్నివేశంలో అటువంటి వర్ణన సమంజసమే కావచ్చును, కాని చోట అశ్లీలాత్మకంగా స్ఫురించవచ్చు. ఒక కావ్యాన్ని చదివేటప్పుడు వర్ణనౌచిత్యాన్ని గమనించుకోవాలి కవి, పాఠకులు కూడా. సరే, ఈ వర్ణనల ఉచితానుచితాల చర్చను కాసేపు అలా పక్కన ఉంచితే -
తొలకరి చినుకుల ప్రయాణాన్ని ఎంత సౌందర్యాత్మకంగా రూపు కట్టించాడో చూడండి, కవి ఈ పద్యంలో. తల మీద నుంచి కనురెప్పల పైకి, మోవి పైకి జారి ఆపై ఉరోజముల మీదకు దూకి ధారలై నాభి దాకా పారి - ఇలా జలధారలతో విన్యాసం చేయించాడు. ఒక సామాన్య దృశ్యానికి కళాకృతి కల్పించాడు. వాన చినుకుల్లానే పద్యం లోని పదాలు కూడా విభ్రమించి వెల్వడి వెడనిల్చి పడి చెదరి పారుతున్నట్టు పద్యధార కూడా ఆ చినుకుల ధార లాగా ఆగుతూ విరుగుతూ నడిచింది. మిక్కిలి ప్రౌఢకావ్యం నన్నెచోడుని కుమార సంభవం. కేవలం పద్యాలు రాయడం కాకుండా, పదాలు ఏవి ఎప్పుడు ఎందుకో వాడాలో తెలిసిన కవి రచించిన కావ్యం. ఈ కావ్యంలో ఇలాగే మరిచిపోలేని పద్యాలు చాలా ఉన్నాయి.

అన్నమయ 

తిరుమలయ్య విందు మంచిదే వుండంటే వుంటినమ్మ  
సరవిలేని చెంచువారి సంతయేలె తనకును
పరికిదండ పొగడదండ బండిగురిగింజ దండ
బెరకులేని పికిలిదండ బలిదండలన్నియు
మెరసి కానుకియ్యబోతె మేనిదండలడిగెనమ్మ
మరల చెంచువారితోడి మాటలేలె తనకును
ముసురుతేనె జుంటితేనె ముదిరినట్టి పెరలతేనె
పొసగ మించు పూవుతేనె పుట్టతేనె లన్నియు
వొసగి కానుకియ్యబోతె మోవితేనె లడిగె నమ్మ
యెసగ చెంచువారి యెంగి లేటికమ్మ తనకును
వెలగపండు జీడిపండు వెలలేని మోవిపండు
పలుకుదొండపండు పాలపండు కానుకిచ్చితే
చెలగి పక్కపండు మంట శ్రీవేంకటనాయకుడు
యెలమి కూడెనమ్మ చెంచు లేటికమ్మ తనకును

ముద్దు గారీ జూడరమ్మ మోహన మురారి వీడె
మద్దులు విరిచిన మా మాధవుడు

చల్ల లమ్మ నేరిచినజాణ గొల్లెతల కెల్ల
వల్లెతాడు మా చిన్న వాసుదేవుడు
మొల్లపు గోపికల మోవిపండులకు నెల్ల
కొల్లకాడు గదమ్మ మా గోల గోవిందుడు


మందడిసానుల కమ్మని మోముదమ్ములకు
చెందినతుమ్మిదవో మా శ్రీకృష్ణుడు 
చంద మైన దొడ్డీవారి సతులవయసులకు
విందువంటివా డమ్మ మా విఠ్ఠలుడు


హత్తిన రేపల్లెలోని అంగనామణుల కెల్ల
పొత్తుల సూత్రము మా బుద్ధుల హరి
మత్తిలి వ్రేతెల నిండుమనసుల కెల్లాను
చిత్తజునివంటి వాడు శ్రీ వేంకటేశుడు


CONCEPT ( development of human relations and human resources )