04..పద్యాలు తెలుగు - సౌందర్యం - సాహిత్య కళారూపాలు ( పద్యాలు )🌐


తెలుగు సాహిత్యంలో మొదటి పద్య రచన గురించి స్పష్టమైన ఆధారాలు లేవు, కానీ అనేక సాహిత్య చరిత్రకారులు తెలుగు పద్య సాహిత్యానికి శ్రీకారం చుట్టిన మహాకవి నన్నయ భట్టారకుడు (11వ శతాబ్దం) అని భావిస్తున్నారు. నన్నయ, మహాభారతం యొక్క ఆదిపర్వాన్ని తెలుగు భాషలో పద్యరూపంలో రచించినవాడు.

నన్నయ చేసిన ఈ తెలుగు మహాభారతం రచనను "ఆంధ్ర మహాభారతం" అని కూడా పిలుస్తారు. నన్నయ యొక్క రచన ప్రాకృత మరియు సంస్కృతం కలయికతో ఆంధ్ర ప్రజలకు బాగా అర్థమయ్యేలా తెలుగులో రూపొందించబడింది. ఆయన రచన సుసంపన్నమైన పద్యం, శ్రావ్యం, మరియు శైలిలో తెలుగుకు ఆణిముత్యం లాంటి ఒక శాశ్వత కీర్తిని అందించింది.

ఈ విధంగా, నన్నయ తెలుగు పద్య కవిత్వంలో తొలి మహా కవి అని భావించబడతాడు, మరియు తెలుగు పద్య సాహిత్యానికి తన కృషితో బలమైన పునాది వేసినవాడు.

హాలుడు
భాష
హాలుడు ప్రాచీన ఆంధ్రదేశాన్ని పరిపాలించిన శాతవాహన వంశానికి చెందిన రాజు. మత్స్యపురాణం అతనిని శాతవాహనుల వంశంలో 17వ రాజుగా పేర్కొంది.[1]

హాలుడు
శాతవాహనులు
పరిపాలన
క్రీ.పూ.200 - క్రీ.త.200
శాతవాహనులు
హాలుడు అశ్మక రాజ్యంలోని ప్రతిష్ఠానమును పరిపాలిస్తూ ఉన్నాడని ప్రాకృతంలో రచింపబడిన లీలావతి కావ్యం చెబుతుంది. పరిపాలించినది ఆరేళ్ళే అయినప్పటికీ, శాతవాహన వంశపు రాజులందరిలోకీ హాలుడు జగత్ప్రసిధ్ధుడు కావడానికి కారణం ఆ మహారాజు సంకలనం చేసి ప్రపంచానికి అందించిన గాథా సప్తశతి అనే గ్రంథం.
గాథాసప్తశతి (సنس్కృతం: गाथासप्तशती) అనేది ప్రాచీన సంస్కృత సాహిత్యంలో ఒక ముఖ్యమైన కృతిగా ప్రాచుర్యం పొందిన సంపుటం. ఇది సాతవాహన చక్రవర్తి హాలుడు (1వ శతాబ్దం CE) రచించిన గొప్ప కవితా గ్రంథం. దీనిలో మొత్తం 700 గాథలు (ప్రాసयुक्त పద్యాలు) ఉన్నాయి. ఈ కృతి ప్రజల సాధారణ జీవన విధానాన్ని, ప్రేమ కథలను, ప్రకృతి వర్ణనలను, సామాజిక సంబంధాలను అద్భుతంగా ప్రతిబింబిస్తుంది.

ముఖ్యాంశాలు:

1. భాష:
గాథాసప్తశతి ప్రాచీన ప్రాకృత భాషలో రచించబడింది, ఇది ఆ సమయంలో సామాన్య ప్రజలు మాట్లాడే భాష. ఇది సంస్కృతం కంటే సులభమైన భాష.

2. విషయాలు:
ఇందులో ప్రధానంగా ప్రేమ, ప్రకృతి, మరియు జీవన అనుభవాల గురించి పద్యాలు ఉన్నాయి.

గాథలలో స్త్రీల భావజాలం ప్రాముఖ్యత పొందింది.

ప్రకృతి వర్ణనలు, సామాజిక సంబంధాలు, మరియు రోజువారీ జీవితానికి సంబంధించిన వివరణలు ఇందులో ఉన్నాయి.

3. రచనా శైలి:

పద్య రూపం: కవితా శైలిలో రచించబడింది.

ప్రాకృత ఛందస్సు: అర్థపూర్ణమైన మాటలతో, సుందరమైన శ్రావ్యత కలిగిన శైలిలో రచన జరిగింది.

4. ప్రాముఖ్యత:

ప్రేమ కవితా సంపుటి: దీనిని భారతదేశం యొక్క తొలికాలపు ప్రేమ కవితా సంకలనంగా పరిగణిస్తారు.

సాంస్కృతిక దర్పణం: సాతవాహన కాలం యొక్క సామాజిక, సాంస్కృతిక, మరియు ఆర్థిక పరిస్థితులకు ఇది అద్దం పడుతుంది.

5. సాతవాహన చక్రవర్తి హాలుడు:
హాలుడు ఆంధ్ర దేశానికి చెందిన సాతవాహన చక్రవర్తులలో ఒకరు. గాథాసప్తశతిను రచించి, పాండిత్యానికి, సాహిత్యానికి తగిన గుర్తింపు పొందారు.

అవతరణ:
గాథాసప్తశతి సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ఇది ప్రాచీన భారతీయ సాంస్కృతిక ధోరణులను మరియు శృంగారభావనను అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన గ్రంథంగా నిలుస్తుంది.
హాలుడు సా.శ.69 నుండి 74 వరకు 5 ఏళ్ళు పాలన చేసెను. ఇతడు సింహళరాజు కుమార్తెను పరిణయమాడాడు. ఇతడు విద్యాభిమాని, విద్యారసికుడు. ఇతడు విద్వాంసులను, కవులను ఆదరించి తాను కూడా కవియై ఉన్నాడు. హాలుని కాలమున రాజపోషణము లభించుట వలన దేశభాషలు బాగుగా అభివృద్ధి చెందాయి.

ప్రాచీన మహారాష్ట్ర ప్రాకృతములో హాలుడు సప్తశతి అను నీతిశృంగారకావ్యమును రచించాడు. అందు మనోహరమైన అలంకారములు ఉన్నాయి. ఉదా:చంద్రుడను కలహంస ఈరాత్రి భాగమున ఆకాశమున నిర్మల కాసారమునందు విడివిడియున్న నక్షత్రపద్మముల నడుమ సుఖప్రయాణము కావించుచున్నది.....

హాలుని సప్తశతిని బాణుడు తన హర్షచరిత్రములో పొగిడాడు. "కావ్య ప్రకాశిక" లో, "సరస్వతీ కంఠాభరణము" లో, "దశరూపకవ్యాఖ్యానము" లో సప్తశతి పద్యములుదహరింపబడి ఉన్నాయి.

హాలుని మంత్రి గుణాఢ్యపండితుడు. పైశాచీ భాషలో "బృహత్కథ"ను, "కాతంత్ర వ్యాకరణము"ను ఇతడు రచించాడు. హాలుని ఆస్థానములో సకల విద్యలు నెలకొని ఉండేవని తెలుస్తున్నది. గుణాఢ్యుడు హాలుని మంత్రి కాడని మరికొందరు ఆంధ్రచరిత్రకారుల అభిప్రాయము. హాలుడు, సాలనుడు, కుంతలుడు, శాలివాహనుడు- ఈ నాలుగు పేర్లు ఒక్కనివే అని హేమచంద్రుడు తన దేశకోశములో చెప్పాడు. సా.శ. 78 వసంవత్సరమునుండి లెక్కింపబడుచున్న శాలివాహన శకమునకు ఈ హాలశాతవాహనుడే కర్తయని కొందరి అభిప్రాయం.

హాలుని తరువాత మండలకుడు (సా.శ.74-79), పురీంద్రసేనుడు (సా.శ.79-84), సుందరస్వాతికర్ణుడు (సా.శ.84-85), చకోరస్వాతికర్ణుడు 6 మాసాలు క్రమముగా ఒకరి తరువాత ఒకరు రాజ్యమేలారు. వీరిలో చకోరస్వాతికర్ణి వాసిష్ఠీపుత్రుడు; అనగా ఇతనితల్లి వసిష్ఠగోత్రమువారి ఇంటి ఆడబడుచు. ఈ రాజు వద్ద నుండి తరువాతి రాజులందరును తమ తల్లి పేరును తమ పేరు ముందు వాడటం మొదలుపెట్టారు.
-----------------------------
నడెవు దొందె భూమి కుడివు దొందె నీరు
నుడువగ్ని మొందె తిరలు
కులగోత్ర నడువె యత్తణదు సర్వజ్ఞ.
(మనుష్యులందరూ ఒకే భూమి మీద నడుస్తూ,ఒకే నీరు తాగుతూ చివరకు 
ఒకే నిప్పు లో కాలి నశిస్తుంటే ఇక కుల గోత్రాల గోప్ప ఎక్కడిది ?)
-కన్నడ కవి సర్వజ్ఞుడు
-------------------------------
నిద్రేసి ఆసన్ ఉత్తమ్ పాషాణ
వరీ ఆవరణా అకాశాచే
తే థే కాయకరణే కవణాచీ ఆస్
వాయా హోయ నాశ ఆయుష్యాచా
(నిద్రకు రాతిపానుపు మేలు,ఆకాశమే మంచి కప్పు,
కోరిక జీవితాన్ని వ్యయపరుస్తుంది)- తుకారాం

భర్తృహరి సుభాషితము

కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వ్జలా
నస్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతే-ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్‌ ॥

వయ మిహ సరితుష్టా వల్కలై స్త్వం దుకూలై:
స్సమఇవ పరితోషో నిర్విశేషో విశేషః
సతు భవతు దరిద్రోయస్య తృష్ణా విశాలా
మనసి చ పరితుష్టే కోర్ధవాన్ కో దరిద్రః
ద్రవ్యాశ గలవానికి దారిద్ర్యము గాని
మన స్సం తు ష్టి గలవానికి ద్రవ్య మక్కరలేదు.
భర్తృహరి

కవిత్రయం

ఆదికవి నన్నయ (1023-1063)
Preview
దళిత నవీన కందళ కదంబ కదంబక కేతకీ రజో-
మిళిత సుగంధ బంధుర సమీరణుఁడన్ సఖుఁ డూచుచుండఁగా
నులియుచుఁ బువ్వు గుత్తు లను నుయ్యెల లొప్పుగ నెక్కి యూఁగె ను-
ల్లలదళినీకులంబు మృదులధ్వని గీతము విస్తరించుచున్

తిక్కన్న (1205–1288)


సీ. ఈ వెండ్రుకలు వట్టి యీడ్చిన యా చేయి
దొలుతగాఁ బోరిలో, దుస్ససేను
తను వింత లింతలు తునియలై చెదరి రూపఱి యున్నఁ గని ఉడుకాఱుఁ గాక
యలుపాలఁ బొనుపడునట్టి చిచ్చే యిది పెనుగద వట్టిన భీమసేను
బాహుబలంబునుఁ బాటించి గాండీవ
మను నొక విల్లెప్పుడును వహించు

ఆ.వె. కఱ్ఱి విక్రమంబుఁ గాల్పనే యిట్లు
బన్నములు వడిన ధర్మనందనుడును
నేను రాజరాజు పీనుంగుఁ గన్నారఁ
గానఁ బడయమైతి మేనిఁ గృష్ణ!

ఎఱ్ఱన్న(1325–1353)

Preview
అద్దంకి రాజధానిగా ఉన్న ప్రోలయ వేమారెడ్డి 1325-1353 మధ్యకాలంలో రాజ్యం చేశాడు. అతని ఆస్థాన కవియే ఎఱ్ఱాప్రగడ.హరివంశం ఉపోద్ఘాతంలో ఎర్రన చెప్పిన పద్యం
యుగకర్తయైన ఎఱ్ఱాప్రగడ హరివంశమును, భారత అరణ్య పర్వ శేషమును, నృసింహ పురాణమును వ్రాసాడు. రామాయణం కూడా వ్రాశాడు కాని అది లభించడంలేదు. భాస్కరుడు భాస్కర రామాయణమును, నాచన సోన ఉత్తర హరివంశమును వ్రాసారు. రావిపాటి త్రిపురాంతకుడు వ్రాసిన రచనలలో "త్రిపురాంతకోదాహరణము" మాత్రం లభిస్తున్నది. చిమ్మపూడి అమరేశ్వరుడనే మహాకవి "విక్రమసేనము" అనే మహాగ్రంధాన్ని వ్రాశాడట గాని అది లభించడంలేదు.
నన్నయభట్ట తిక్క కవినాథులు చూపిన త్రోవ పావనం
బెన్నఁ బరాశరాత్మజ మునీంద్రుని వాఙ్మయ మాదిదేవుఁడౌ
వెన్నుని వృత్త మీవు కడు వేడుకతో విను నాయకుండ వి
ట్లెన్నియొ సంఘటించె మదభీప్సిత సిద్ధికి రాజపుంగవా!

శ్రీ కృష్ణుని శైశవోత్సవ వర్ణన (హరివంశంలో)

పాలుపారగా బోరగిలి పాన్పు నాల్గుమూలలకును వచ్చుచు మెలగి మెలగి
లలి గపోలమ్ములు గిలిగింతలువుచ్చి నవ్వింప గలకల నవ్వినవ్వి
ముద్దులు దొలుకాడ మోకాల గేలను దడుపుచు నెందును దారితారి
నిలుచుండబెట్టి యంగుళు లూతసూపగా బ్రీతితప్పడుగులు వెట్టిపెట్టి
అన్నగంటి దండ్రినిగట్టి నయ్యగంటి
నిందురావయ్య విందుల విందవంచు
నర్ధిదను బిలువంగ నడయాడియాడి
యుల్లసిల్లె గృష్ణుడు శైశవోత్సవముల

వెన్నెవెట్టెద మాడుమాయన్న యన్న
మువ్వలును మొలగంటలు మొరయు నాడు
నచ్యుతుండు, గోపికలు దమయాత్మ బ్రమసి
పెరువు దరువను మరచి సంప్రీతిజూప

కృష్ణదేవరాయలు 1509-1530 (ఈ సామ్రాజ్యం 1336 నుండి 1660 వరకు వర్ధిల్లింది. )
Preview
 స్వస్వయంగా  కవిపండితుడు కూడా కావడంతో 
ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడుఅని బిరుదు. 
ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము
మదాలసాచరితము,సత్యవధూపరిణయము,
సకలకథాసారసంగ్రహముజ్ఞానచింతామణిరసమంజరితదితర గ్రంథములు,
 తెలుగులో ఆముక్తమాల్యద లేకగోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు.[3] 
తెలుగదేల యన్న దేశంబు తెలుగేను 
తెలుగు రేడ నేను తెలుగొకొండ 
ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి
 దేశభాష లందు తెలుగు లెస్స
అన్న పలుకులు రాయలు వ్రాసినవే


రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. భువనవిజయంలోఅల్లసాని పెద్దననంది తిమ్మనధూర్జటి,మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడుపింగళి సూరనరామరాజభూషణుడు(భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.

అల్లసాని పెద్దన
కేదారేశు భజించితిన్‌ శిరమునన్‌ కీలించితిన్‌ హింగుళా 
పాదాంభోరుహముల్‌ ప్రయాగనిలయుం పద్మాక్షు సేవించితిన్‌ 
యాదోనాథసుతాకళత్రు బదరీనారాయణుం కంటి నీ 
యా దేశంబననేల చూచితి సమస్తాశావకాశంబులన
*తొలితెలుగు ప్రబంధం , ప్రథమాశ్వాసము మనుచరిత్ర-
---------------------------------------------------
కలలంచు న్శకునంబులంచు గ్రహయోగంబంచు సాముద్రికం
బు లటంచుం దెవులంచు ,దిష్టియనుచు న్భూతంబులంచు న్విషా
దు లటంచు న్నిమిషార్ధ జీవనములందుం బ్రీతి పుట్టించి నా
సిలుగుల్ ప్రాణుల కెన్ని చేసితివయా ! శ్రీ కాళహస్తీశ్వరా !        

                   ఈశ్వరా !  రెప్పపాటు లో మరణించే  ఈ జీవుల యొక్క  జీవితాల లో మమకారాన్ని పుట్టించి ,  కలలనీ , శకునాలనీ ,  గ్రహా యోగ సాముద్రికాలనీ , రోగాలు ,  దిష్టులు భూతాలనీ , విషప్రయోగాలనీ  ఎన్ని ఆపదలను సృష్టించావు  స్వామీ  !
*ధూర్జటి   శ్రీ కాళహస్తీశ్వర శతకము
బమ్మెర పోతన - 1450–1510
Preview
మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు రాయంచ సనునె తరంగిణులకు
లలిత రసాలపల్లవ ఖాది యై చొక్కు కోయిల సేరునే కుటజములకు
బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పానవిశేష మత్త
చిత్త మేరీతి నితరంబు జేరనేర్చు
వినుతగుణశీల! మాటలు వేయునేల?

శతకములు ,శతక కర్తలు
వేమన ( 1650 - 1750 ) శతకము
Preview
పద్యం:
ఆత్మశుద్ది లేని యాచారమదియేల?
భాండశుద్ది లేని పాకమేల?
చిత్తశుద్ది లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యం:
మనసు నిర్మలతో లేనపుడు ఏపని చేసిన అది వ్యర్ధమే అగును.అపరిశుభ్రముగా వున్న పాత్రలో వంట చేసినచో అది శరీరమునకు మంచిదికాదుగదా.అదేవిధముగా నిశ్చలమైన మనస్సుతో చేయని భగవంతుని పూజలు కూడా ఎలాంటి ఫలితాలనివ్వవు.
కుండ కుంభ మన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణ మన్న నొకటికాదె
భాష లిట్టె వేరు పరతత్వమొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ
కుండ కుంభమన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణమన్న నొకటి కాదె
భాష లిట్టె వేరు పరతత్వమొకటె
విశ్వధాభిరామ వినుర వేమ ! 
 
ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు,
చూడచూడ రుచుల జాడవేరు,
పురుషులందు పుణ్య పురుషులువేరయ,

కరకు కాయల దిని కాషాయ వస్త్రముల్
బోడినెత్తి గలిగి బొరయుచుండ్రు,
తలలు బోడులైన తలపులు బోడులా

కుండ కుంభమన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణమన్న నొకటి కాదె 
భాష లిట్టె వేరు పరతత్వమొకటె

చంపదగిన యట్టి శత్రువు తన చేత
చిక్కెనేని కీడు సేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటే చావు 

చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు కొదువ గాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత? 

పట్ట నేర్చు పాము పడగ యోరగజేయు
చెరుప జూచు వాడు చెలిమి జేసు
చంపదలచు రాజు చనువిచ్చుచుండురా 
విశ్వధాభిరామ వినుర వేమ ! 

Potana👍
వచన సాహిత్యము ఉపన్యాసములు బమ్మెర పోతన - డా. సి. నారాయనా రెడ్డి
భక్తి కవితా చతురానన బమ్మెర పోతన
- డాక్టర్‌ సి. నారాయణరెడ్డి గారు (సమీకరణ )

యువభారతి వారి వికాసలహరి - ఉపన్యాస మంజరి
ఉపన్యాసకులు: డాక్టర్‌ సి. నారాయణరెడ్డి గారు
ద్వితీయ సమావేశం (21-10-1973)
బమ్మెర పోతన అనగానే భాగవతం గుర్తొస్తుంది. భాగవతం అనగానే భక్తిలో తడిసిన గాథలు అలలుగా పొంగివస్తాయి - గజేంద్రమోక్షం, ప్రహ్లాదచరిత్ర, వామన చరిత్ర, రుక్మిణీకల్యాణం, అంబరీషోపాఖ్యానం, అజామిళోపాఖ్యానం - ఇంచుమించుగా భాగవతంలోని ఉపాఖ్యానాలన్నీ. ఈ భక్తమణుల చరిత్రలను ఏకత్రితం చేసిన మూలసూత్రం వాసుదేవతత్త్వం. వ్యాసునంతటివాడే వేదాలను వింగడించి, అష్టాదశ పురాణాలు విరచించి, బ్రహ్మసూత్రాలను ప్రవచించి, భారతాన్ని ప్రబంధీకరించి అప్పటికీ మనస్సు నిండక 'హరికీ, యోగివరులకూ అభిలాషమైన భాగవత గాథ పలుకనైతినే' అని ఖిన్నుడైనాడు. నారదబోధితుడై విష్ణుకథాశిరోమణియైన భాగవతాన్ని ఎన్నుకున్నాడు. ఆ రకంగా తన మదిలో కలిగిన అరకొరలను తీర్చు కొన్నాడు.
వ్యాసభారతం తెలుగుసేత ఆంధ్రకావ్యలక్ష్మికి అసలైన కైసేత. ఆ యమ్మను అంతకుముందు చిటిపొటి నగలతో సింగారించిన తెలుగు కవులు లేకపోలేదు. వారి వెన్నెలపదాలూ, తుమ్మెదపదాలూ, ఉయ్యాలపాటలూ, నివాళిపాటలూ, ఏలలూ, జోలలూ పుడమితల్లి కడుపున కరిగిపోయి ఉంటాయి. దేశీయుల నాల్కలలో మాటుమణిగి ఉంటాయి; లేక ఏ తాటాకులలోనో, రాగిరేకులలోనో, రాతిపలకపైనో ముక్తకప్రాయంగా పడి ఉంటాయి. అయితే తెలుగు కవిత్వానికి తొలిసారిగా గ్రంథస్థితి కలిగించింది కవిత్రయమే. అంటే నేటి గ్రాంథిక భాషకు పాదులువేసినవారు నన్నయ్య - తిక్కన్న - ఎర్రన్నలే! భాషకేకాదు, తెలుగులో కావ్యరచనాశైలిని తీర్చిదిద్దింది కూడా ఈ మూర్తిత్రయమే! చతుర్వేదసారమైన వ్యాసభారతం వారిచేతిలోపడి కావ్యచిక్కణత్వాన్ని సంతరించుకొంది. పద్యవిద్యకు ఆద్యుడైన వాల్మీకి రచించిన రామాయణం భాస్కరాదుల ద్వారా తెలుగు పొలంలో పదంమోపింది. ఆ విధంగా భారతీయ సంస్కృతికి మూల కందాలయిన మూడు గ్రంథాలలో భారతరామాయణాలు ఆంధ్రావళి చేతికందినవి. ఇక మిగిలింది వ్యాస భాగవతం. అప్పటికి దానిపై ఎవరిచూపూ పడనట్టుంది. చూపు పడినా చేయిసాచే చొరవ ఏ కవికీ కలుగనట్టుంది. ఆ మహాభాగవతం ఒక తెలుగు చిలుక కొరకు వేచి ఉంది. ఆ చిలుక తెలంగాణా నడిబొడ్డులో ఓరుగల్లుగడ్డలో బమ్మెర కొమ్మపై అప్పటికే వీరభద్ర విజయాన్ని వినిపించింది. భోగినీదండకాన్ని ఒక రాచవలరాచవాని చెవులకు రసికవాణిగా అందించింది. ఆ శుక రాజే మన పోతరాజు. ఆ "శుకముఖసుధాద్రవమున మొనసియున్న" భాగవతఫలరసాస్వాదనం తెలుగు రసిక భావవిదుల మహిత భాగధేయం.
వీరభద్రవిజయం రచించేనాటికి పోతన్న పిన్నవాడు. పెక్కు సత్కృతులు వ్రాయనివాడు. తన గురువైన ఇవటూరి సోమనారాధ్యుని ప్రసాదమహిమచే ఆ కృతిని రచింపగలిగినాడు. వీరభద్రవిజయం పోతన్న చేయనున్న సేద్యానికి తొలిచాలు. సర్వజ్ఞ సింగభూపాలునికి కానుకవెట్టిన భోగినీదండకం మలిచాలు. ఇకచాలు. ఆ తరువాత పోతన్న మనసు మలుపు తిరిగింది. అటు వీరశైవమతం మీదా ఇటు రసికరాజానుమతం మీదా దృష్టి తొలగింది. వ్యాసునికి విష్ణుకథ విరచించని కొరత తోచినట్లే మన పోతన్నకు "శ్రీమన్నారాయణ కథాప్రపంచ విరచనా కుతూహలం" కుట్మలించింది. అది రాకానిశాకాలం. సోమోపరాగసమయం. గంగాస్నానం, మహేశ్వర ధ్యానం - అదీ పోతన్న స్థితి. "కించిదున్మీలత లోచనుడై" ఉండగా రామభద్రుని సాక్షాత్కారం. మహాభాగవతం తెనుగు సేయమని ఆనతి. వెరగుపడిన చిత్తంతో పోతన్న అంగీకృతి. చిత్రం! పోతన్నకు కలిగిందేమో విష్ణుకథా రచనా కుతూహలం, చేసిందేమో మహేశ్వరధ్యానం. కట్టెదుట నిలిచినవాడో - రామచంద్రుడు. ఆమహానుభావుడు సూచించిన వస్తువో గోవిందకథాకదంబమైన భాగవతగ్రంథం. అంకితం తనపేరనే అన్నాడు ఆ రామరాజు. ఔ నన్నాడు మన పోతరాజు. "శ్రీరామచంద్రుని సన్నిధానంబు కల్పించుకొని", "హారికి, నందగోకులవిహారికి" అంటూ షష్ఠంతాలెత్తుకొని ఆంధ్రభాగవతాన్ని చిన్నికృష్ణునికి సమర్పించుకున్నాడు. రామన్నను శ్రోతగా నిలుపు కొని భాగవతపుగాథను విన్నవించుకున్నాడు. ఇదిచిత్రమా? కాదు. పోతన్న పెంపొందించుకున్న సమచిత్తం. శివుడు, కేశవుడు, రాముడు, కృష్ణుడు - ఈ నాలుగు మూర్తులకు ఏకత భజించటం పోతన్న అభేదభక్తికి తులలేని తార్కాణం. ఇంతటి సమన్వయ దృక్పథం అప్పటి మతవాతావరణంలో అపూర్వం.
ఏ కథను ఏరుకోవాలి? ఏరుకున్న కథను ఎక్కడ ఎత్తుకోవాలి? ఆ వస్తువును ఏ దృష్టితో విస్తరిస్తున్నదీ ఎలా వివరించాలి? తన కవితాలక్ష్యాలను ఏ రకంగా సిద్ధాంతీకరించాలి? ఏ కవికైనా ఈ అవస్థ తప్పదు. కృత్యాద్యవస్థ అంటే ఇదే. ఆదికవి నన్నయభట్టారకునికీ ఇది తప్పలేదు. అవతారికలో రాజరాజును గూర్చీ తనను గూర్చీ చెప్పుకున్న తర్వాత అసలు విషయం అందుకున్నాడు. తాను వ్రాయనున్న భారతం తన ఎన్నిక కాదు. అది ప్రధానంగా రాజరాజు మన్నిక. హిమకరుడు మొదలుకొని పాండవోత్తములవరకు తీగసాగిన తన వంశీయుల చరిత్రను తెలుగులో వినాలనే అభీష్టం రాజరాజుకు కలిగింది. అది కాస్తా తన కులబ్రాహ్మణుడైన నన్నయ చెవిలో వేసినాడు. భారత శ్రవణం అనేక పుణ్యఫల ప్రదమని దానికి ప్రాతిపదికకూడా వేసినాడు. ఆ రాజపోషకుని అనుమతంతో, విద్వజ్జనుల అనుగ్రహంతో తాను నేర్చిన విధంబున వ్యాసభారతాన్ని తెనిగించినాడు నన్నయ భట్టారకుడు. తెలుగులో ఆదికవి నన్నయ, సంస్కృతంలో ఆదికవి వాల్మీకి. మరి నన్నయ్య ఆ రామాయణాన్ని వదిలి భారతాన్ని చేపట్టడానికి ప్రధానకారణం రాజరాజుకు భారతంపట్ల గల అభిమానం అని తేలిపోయింది. అంటే వస్తువరణంలో కూడా ఆ కృతికర్తకు స్వేచ్ఛ లేదేమో అని అనుకోవలసి వస్తుంది. అవతారికారచనలోనూ తదనంతరకవులకు నన్నయ్యే మార్గదర్శి. తిక్కన్న స్థూలంగా ఆ సంవిధానాన్నే అనుసరించినా, కొంచెం కొత్త దారి తొక్కినాడు. నన్నయ్య తెనిగించగా మిగిలిన భారతాన్ని తాను రచించాలని సంకల్పించుకున్నాడు. ఇది ఎవరో సూచించిన వస్తువు కాదు. తిక్కన్న తానే చేసుకున్న ఎన్నిక. సరిగ్గా పోతన్న తిక్కన్న తెన్నునే అనుసరించినాడు. భాగవతావతారికను విరాటపర్వావతారికకు తోబుట్టువుగా తీర్చిదిద్దినాడు. తిక్కన్నలాగే తన వస్తువును తానే ఏరుకున్నాడు పోతన్న. తిక్కన్న భారత రచనా కౌతుకం కనబరిస్తే, పోతన్న శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనా కుతూహలం కనబరచినాడు. అతడు నిద్రించే సమయంలో "కలలో కన్నట్లు"గా హరిహరనాథుడు కనిపిస్తాడు. ఇతడు గంగాతీరంలో మహేశ్వరధ్యానం చేస్తూ కన్ను లరమూసుకొని ఉండగా రామభద్రు డగుపిస్తాడు. "కరుణారసము పొంగి తొరగెడు చాడ్పున" అన్న సీసపద్యంలో హరిహరనాధుణ్ని రూపుకట్టించినాడు తిక్కన్న. "మెఱుగు చెంగట నున్న మేఘంబు కైవడి" అన్న సీసపద్యంలో సీతానాధుణ్ని చిత్రించినాడు పోతన్న. అతడు సర్వేశ్వరుడు. ఇతడు రాజముఖ్యుడు. అక్కడ హరిహరనాధుడు సెలవిస్తాడు - భారత రచనా ప్రయత్నం భవ్య పురుషార్థ తరుపక్వఫలమని. దానిని తనకు కృతి ఇమ్మని; ఇక్కడ రామభద్రుడు ఆనతిస్తాడు - మహాభాగవతం 'తెనుగుసేయు'మని తనపేర అంకితమిమ్మని. తామే ఇతివృత్తాన్ని స్వీకరించడం, నరేశ్వరుణ్ని కాక సర్వేశ్వరుణ్ని కృతిపతిగా నిర్ణయించడం తిక్కన పోతన్నల కున్న సమధర్మం. ఈ కృతులు రచించేనాటికి ఇద్దరి మనః ప్రవృత్తులు ఎల్లలు లేని భక్తిసరిత్తులు. భారతరచనం తిక్కన్న దృష్టిలో ఆరాధన విశేషం. భాగవతరచనం పోతన్న దృష్టిలో భవబంధవిమోచనం. ఇక్కడే ఉంది పోతన్న అదృష్టం. చిత్తస్థితికి తగిన ఇతివృత్తం దొరికింది. పరవశించి పాడుకున్నాడు.
"పలికెడిది భాగవతమఁట
పలికించు విభుండు రామభద్రుండఁట; నేఁ
పలికిన భవహర మగునట;
పలికెద వేఱొండుగాథఁ బలుకఁగ నేలా?"
నాలుగు పలుకులను ప్రాసస్థానంలో చిలికి తన పులకలు వెలార్చుకొన్నాడు. అయితే భాగవతరచన అంతంత మాత్రాన జరిగేదికాదు. ఈ "సహజ పాండిత్యు"నికి అది తెలియదా? అదీ విన్నవించుకొన్నాడు.

"భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు
శూలికైనఁ దమ్మి చూలికైన
విబుధజనుల వలన విన్నంత కన్నంత
తెలియ వచ్చినంత తేటపఱుతు."
భాగవతం తెలుసుకోవడం, తెలిసింది తెలుపుకోవడం చిత్రమట! నిజమే, రామాయణం అలలా సాగిపోయే మనిషి కథ. భారతం భిన్న లౌకిక ప్రవృత్తుల సంఘర్షణ వ్యథ. భాగవతం స్థూలదృష్టికి కృష్ణలీలాపేటిక, విష్ణుభక్తుల కథావాటిక. సూక్ష్మంగా పరిశీలిస్తే అది మధ్యమధ్య ఎన్నెన్నో విప్పలేని వేదాంతగ్రంథులున్న మహాగ్రంథం. ఆ ముడులు విప్పడం హరునికీ, విరించికీ దుష్కరమే! మరి ఆ భాగవత రహస్యం ఆ భగవంతునికే తెలియాలి. భారం అతనిపై వేసి వ్యాసభాగవతవ్యాఖ్యాత అయిన శ్రీధరుణ్ణి ఆలంబనం చేసుకుని తెలియవచ్చినంత తేటపరచినాడు ఈ వినయశీలుడు. ఈ తేటపరచటం ఏ తెలుగులో? నన్నయ ప్రారంభించిన తత్సమపద బహుళమైన తెలుగులోనా? లేక పాల్కురికి సోమన్న ప్రఘోషించిన జానుతెనుగులోనా? పోతన్న సాత్వికత అహంతలకూ వింతవింత పుంతలకూ అతీతమైనది.

"కొందఱికిఁ దెనుఁగు గుణమగుఁ;
గొందఱికిని సంస్కృతంబు గుణమగు; రెండున్‌
గొందఱికి గుణములగు; నే
నందఱి మెప్పింతుఁ గృతుల నయ్యైయెడలన్‌."
కొందరికి తెనుగు గుణమట. ఇందులో పరోక్షంగా పాలకురికి, ప్రత్యక్షంగా తిక్కన్న కనిపిస్తున్నారు. కొందరికి సంస్కృతం గుణమట. ఇందులో సుదూరంగా నన్నయ, సమీపంగా శ్రీనాథుడు వినిపిస్తున్నారు. ఆయాకవులే కాదు, వారి అనుయాయులు కూడా స్ఫురిస్తున్నారు. 'ప్రౌఢంగా పలికితే సంస్కృతభాష అంటారు. నుడికారం చిలికితే తెలుగుబాస అంటారు. ఎవరేమనుకున్నా నాకు తరిగిందేముంది? నా కవిత్వం నిజంగా కర్ణాటభాష' అని ఎదుటివాళ్లను ఈసడించి తోసుకుపోయే రాజసంగాని, తామసంగాని పోతన్నకు అలవడలేదు. అది శ్రీనాధుని సొత్తు. ఈ పద్యమే పోతన్న సత్త్వమూర్తికి అద్దం పట్టింది. 'ఆయా సందర్భాలనుబట్టి అందరినీ మెప్పిస్తాను' అన్న మాటలో వినయం ఎంత మెత్తగా ఉందో, విశ్వాసం అంత వొత్తుగా ఉంది. భాగవతం చదివితే తెలుస్తుంది అతని సంస్కృతగుణం; అచ్చతెనుగుతనం.

నన్నయాదులు భారతాన్ని ఆంధ్రీకరించినారు. భాస్కరరంగనాథాదులు రామాయణాన్ని అందించినారు. నాచన సోమన మారన వంటివారు పురాణాలను అనువదించినారు. వీ రెవ్వరూ తన పురాకృత శుభాధిక్యంవల్ల భాగవతాన్ని తెనిగించలేదు. దీనిని తెనిగించి పునర్జన్మ లేకుండా తన జన్మను సఫలం చేసుకుంటానని ఆకాంక్షించినాడు పోతన్న. వేయి నిగమాలు చదివినా సుగమం కాని ముక్తి భాగవతనిగమం పఠిస్తే అత్యంత సుగమం అని విశ్వసించినాడు. ఆ ముక్తివాంఛే భాగవత రచనకు మూలం. మొట్టమొదటి పద్యమే ఆ ఆశయానికి దిద్దిన ముఖతిలకం.

"శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్‌ లోకర
క్షైకారంభకు భక్తపాలనకళా సంరంభకున్‌ దానవో
ద్రేక స్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాలసంభూతనా
నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్‌."
ఇది నాందీశ్లోకం వంటి పద్యం. ఆశీర్నమస్క్రియా వస్తునిర్దేశాలలోని ఒక లక్షణం నిక్షేపించడం దీని లక్ష్యం. "శ్రీవాణీగిరిజా శ్చిరాయ" అని నన్నయ అన్నాడు. "శ్రీయన గౌరి నాఁబరగు" అని తిక్కన అన్నాడు. "శ్రీకైవల్యపదంబు"ను పోతన్న ప్రస్తావించినాడు. ఈపద్యంలో నమస్క్రియతో పాటు వస్తునిర్దేశం కూడా ఉండటం విశేషం. భాగవత కథానాయకుడు నందనందనుడు. అత డవతార పురుషుడు. లోక రక్షణం ఆ అవతారానికి ప్రేరణం. అతడు గజేంద్రాది భక్తులను పాలించినవాడు. హిరణ్యకశిపు ప్రభృతి దానవుల ఉద్రేకాలను స్తంభింప జేసినవాడు. ఈ రెండు అంశాలు శ్రీమన్నారాయణుని శిష్టరక్షణకూ దుష్టశిక్షణకూ మూలకందాలు. భాగవత కథాచక్రం ఈ రెండు అంశాలచుట్టే చంక్రమించింది. ఈ రకంగా పోతన్న పై పద్యంలోని పాదచతుష్కంలో భాగవతంలోని పన్నెండు స్కంధాల పరమార్థాన్ని నిర్దేశించినాడు. మరొకవిశేషం ఈ పద్యంలోని నందాంగనా డింభకుడు కేవల స్థితికారుడే కాడు, సృష్టికారుడు కూడా. "కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు" అనే ప్రయోగంలో అది ధ్వనించింది. "దానవోద్రేకస్తంభకు" అనే మాటలో అతని లయ కారత్వం స్ఫురించింది. అంటే ఈ పద్యంలో నందింప బడిన పరమాత్ముడు త్రిగుణాత్ముడు. అయితే విశ్లేషించుకుంటే బోధపడే అర్థమిది. ఒక మహోర్మికలా ఉప్పొంగి వచ్చే మూర్తి మాత్రం సత్త్వానిది. కాష్ఠంకంటే ధూమం, ధూమంకంటే త్రయీమయమైన వహ్ని విశేషమైనది. అలాగే తమోగుణం కంటే రజోగుణం, రజోగుణంకంటే బ్రహ్మప్రకాశకమైన సత్త్వం విశిష్టమైనది. (ప్రథమ స్కంధం 59) అందుకే తొల్లిటి మునులు సత్త్వమయుడని భగవంతుడైన హరినే కొలిచినారు. ఆ భగవంతుని సత్త్వనిర్భర స్వరూపమే పైపద్యంలో ఉల్లేఖింపబడింది.

అవతారికలోని రచనాలక్ష్యాన్ని పరికించినా, నాందీపద్యాన్ని పరిశీలించినా పోతన్న ధ్యేయం కైవల్యమేనని బోధపడుతుంది. భవబంధరాహిత్యం, జన్మసాఫల్యం కైవల్యం వల్లనే సాధ్యం. ఆ కైవల్యం పోతన్న వాంఛించిన పరమపదం; పురాజన్మ తపఃఫలం. ఈ కైవల్యకాంక్ష ప్రవృత్తిలా భాసించే నివృత్తి; భాగవతంలోని ప్రధాన రసమైన భక్తికి ఆదిలోనే ఎత్తిన వైజయంతిక.

ఇంచుమించుగా సమకాలీనులైన శ్రీనాథ పోతనామాత్యుల వ్యక్తిత్వాల వాసి ఇక్కడే ఉంది. శ్రీనాథుడు శృంగారిగా ఎంత వ్యాపృతుడైనా 'ఈశ్వరార్చన కళాశీలుండ'ననే చెప్పుకున్నాడు. భోగినీదండకం వంటి పరమశృంగార కృతి రచించినా పోతన్న మహాభక్తుడుగానే పేరొందినాడు. కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శివరాత్రి మాహాత్మ్యం వంటి భక్తిప్రబంధాలు వ్రాసినా, నైషధంలోని రక్తివల్లనూ, చాటుపద్యాలలోని శృంగార ప్రసక్తివల్లనూ శ్రీనాథుడు శృంగారసనాథుడుగా స్థిరపడినాడు. రుక్మిణీకల్యాణం, రాసక్రీడాభివర్ణనం వంటి ఘట్టాలలో ఎంతటి శృంగారదంతురితాలైన వర్ణనలు చేసినా పోతన్న తెలుగుల పుణ్యపేటిగానే కీర్తింప బడుతున్నాడు. ఇందుకు ఒకకారణం - కాలం గడిచినకొద్దీ వీరిచుట్టూ అల్లుకున్న కట్టుకథలు. మరొకకారణం - కావ్యావతారికల్లో వీరి వ్యక్తిత్వాలు వేసుకున్న ముద్రలు. శ్రీనాథుని కృతులన్నీ నరాంకితాలు. అతని జీవితంలోని ఉజ్జ్వల ఘట్టాలన్నీ రాచకొలువులకే సమర్పితాలు. పట్టెడు వరిమెతుకులు, గుక్కెడు మంచినీళ్ళు పుట్టని దుర్దశలో కూడా ఆ రాజస మూర్తి అటు కృష్ణుణ్ణో, ఇటు శివుణ్ణో దుయ్యబట్టినాడు. 1 ఇరవై సంవత్సరాలు కొండవీటిలో విద్యాధికారిగా ఒక వెలుగు వెలిగి అంతటితో యశోభిలాష సన్నగిల్లక, ఎక్కడో కర్ణాటరాయల కొలువులో, నిక్కిపడే గౌడ డిండిమభట్టును ఉద్భట వివాదప్రౌఢితో ఓడించి, అతని కంచుఢక్కను పగులగొట్టించి, రాయల సభాగారంలో స్వర్ణస్నానం చేయించుకునే దాకా తృప్తిపడని మత్యహంకృతి అతనిది. దిక్కూమొక్కూ లేని అవసానదశలో దివిజకవివరుని గుండియలు దిగ్గురనేటట్టు కడ ఊపిర్లో గూడా కవిత లల్లగల్గిన ప్రౌఢవ్యక్తిత్వం అతనిది. మరి పోతన్న వ్యక్తిత్వం ఇందుకు భిన్నం. అతడు నరాధిపులను కొలువలేదు; సిరులకై ఉరుకులాడలేదు; అధికారాన్ని ఆశించలేదు; అహంకారాన్ని ప్రకటించలేదు. పూర్వకవులతోపాటు, వర్తమాన కవులతో పాటు భావికవులను గూడా బహూకరించిన వినయభూషణు డతడు. సమకాలీనకవులను సంభావించడమే ఒక విశేషం. పుట్టని కవులకు జేకొట్టడం పోతన్న సహనశీలానికి నిదర్శనం. సహనగుణం సత్త్వం పాదులో పుట్టేదే కదా! ఈ సత్త్వగుణాన్ని ఆధారంగా చేసుకునే పోతన్న నిరాడంబర వ్యక్తిత్వాన్ని గూర్చీ, నరాధిప పరాఙ్ముఖత్వాన్ని గూర్చీ కొన్ని చాటు కథలు ఆ నోటికానోటి కెక్కి నేటికీ తెలుగునాట వాడుకలో ఉన్నాయి. భాగవతాన్ని తన కంకిత మివ్వవలసిందని సర్వజ్ఞసింగ భూపాలుడు కోరడం, పోతన్న కాదనడం, భూపాలునికి కోపం వచ్చి దానిని నేలపాలు చేయడం - ఇదోకథ. శ్రీనాథుడూ పోతన్నా స్వయానా బావమరదులు. పోతన్న పొలం దున్నుతుంటే ఆ'నాథన్న' పల్లకిలో రావడం, అటు బోయీలు లేకుండా పల్లకి తేలిపోవడం, ఇటు ఎడ్లు లేకుండా నాగలి సాగిపోవడం - ఇది మరోకథ. ఇవే కాక 'కర్ణాటకిరాటకీచకు' లెవరో అతని కృతిని కాజేయాలని వస్తే ఆ తల్లి సరస్వతి 'కాటుక కంటి నీరు చనుకట్టు' మీద పడేటట్టు బావురు మనడం, "అమ్మా! ఏడువకమ్మా! నిన్ను ఎవరికీ అమ్మనమ్మా!" అని ఈ పరమభక్తుడు ఓదార్చడం - ఇదో పిట్టకథ. కృతిని ఇక్కడ 'ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి', అక్కడ 'కాలుచే సమ్మెటవ్రేటులం బడక' బమ్మెర పోతరాజు భాగవతాన్ని 'సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె'నని అవతారిక లోని మరోపద్యం ఇచ్చే సాక్ష్యం. 2 పోతన్న పేరు చెప్పితేనే సగటు సాహితీ బంధువులకు ఈ పద్యమే గుర్తు కొస్తుంది. ఈ పద్యం పోతన్నది కాదంటే చాలా మందికి గుండెల్లో కలుక్కుమంటుంది. నిజానికి ఈ పద్య రచనలో ఏ కోశానా పోతన్న శైలీవాసన లేదు. 'సొమ్ములు కొన్ని పుచ్చుకొని', 'సొక్కి', 'శరీరము వాసి', 'కాలుచే సమ్మెటవ్రేటులు' 3 'సమ్మతి', 'ఇచ్చిచెప్పె' ఈ 'బమ్మెరపోతరా జొకఁడు' - ఇదీ ధోరణి. ఇవి పోతన్న పలుకులేనా? భావికవులను బహూకరించిన, భవబంధవిమోచనం ఆశించిన భక్తశిరోమణి మాటలేనా? కాదన వలసిన అవసరం లేకుండానే మరొక అంతస్సాక్ష్యం ఉంది. ఈ పద్యానికి ముందుమాట 'ఉభయ కావ్యకరణ దక్షుండనై' అన్నది. ఇది ఉత్తమపురుషంలో ఉంది. వెంటనే 'ఇమ్మనుజేశ్వరాధముల' పద్యంలో 'బమ్మెరపోతరాజొకఁడు' అంటూ ప్రథమ పురుషం దూకుడుంది. ఆ పద్యం తరువాత మరొక పద్యం. తరువాత 'అని మదీయ' అంటూ మళ్లీ ఉత్తమపురుషం దర్శనం ఇచ్చింది. పద్యశిల్పాన్నిబట్టే కాక అన్వయ దోషాన్ని బట్టి చూసినా ఇది పోతన్న పద్యం కాదనే అనిపిస్తుంది. అతని భక్తులో, అనురక్తులో తదనంతర కాలంలో ఈ పద్యాన్ని జొప్పించి ఉంటారు. ఎవరో ఎందుకు? అతని శిష్యుడు సింగయ్యే వ్రాసి ఉంటాడేమో? సింగయ్య భాగవతంలోని షష్ఠ స్కంధాన్ని రచించినాడు. పోతన్న పోతలోనే ఇతనూ ఒక అవతారిక సంతరించుకున్నాడు. పూర్వకవిస్తుతిలో శ్రీనాథునితోపాటు బమ్మెరపోతరాజును స్మరించినాడు. పోతరాజును స్తుతిస్తూ చెప్పిన పద్య మిది:

"ఎమ్మెలు సెప్పనేల? జగమెన్నఁగఁ బన్నగరాజశాయికిన్‌
సొమ్ముగ వాక్యసంపదలు నూఱలు చేసినవాని భక్తిలో
నమ్మినవాని భాగవతనైష్ఠికుఁడై తగువానిఁ బేర్మితో
బమ్మెర పోతరాజు కవి పట్టపురాజుఁ దలంచి మ్రొక్కెదన్‌."
ఈ పద్యంలో ఒకటి రెండు అంశాలు గమనింపదగినవి ఉన్నాయి. 'ఇమ్మనురాజేశ్వరాధముల' పద్యంలో 'సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె' 'ఈబమ్మెర పోతరా జొకఁడు భాగవతంబు' అని ఉంది. 'ఎమ్మెలు సెప్పనేల' పద్యంలో 'పన్నగరాజశాయికిన్‌', 'సొమ్ముగ ... భాగవత నైష్ఠికుఁడై ... తగువాని ... బమ్మెర పోతరాజు.' అని ఉంది. ఆ పద్యంలో ప్రాసస్థానంలో 'సొమ్ములు' 'బమ్మెర' ఉన్నాయి. ఈ పద్యంలోనూ ఆ మాటలే ఉన్నాయి. అక్కడ 'జగద్ధితంబుగన్‌' అని ఉంటే ఇక్కడ 'జగమెన్నఁగ' అని ఉంది. 'సమ్మతి శ్రీహరి కిచ్చి' చెప్పడం అని అందులో ఉంటే ఆ స్వామికి 'సొమ్ముగ వాక్యసంపదలు నూఱలు' చేయడం ఇందులో ఉంది. ఈ రెండు పద్యాల్లోనూ పోతన్న భక్తి తత్పరతే ఉగ్గడింపబడింది. పైగా రెండుపద్యాల గతికూడా ఒకేస్థితిలో ఉంది. కనుకనే ఈ సింగయ్యే ఆ పద్యం రచించి పోతన్న అవతారికలో చేర్చి ఉంటాడేమో అనే సందేహం కలుగుతుంది. అలాకాదు. పోతన్న పద్యానికే సింగన్న పద్యం అనుకరణమేమో అని ఎవరైనా వాదించవచ్చు. అందుకు నా సమాధానం మొదట చెప్పిందే. పద్యశిల్పంలో గానీ, పదప్రయోగంలో గానీ, భావశుద్ధిలోగానీ ఈ పద్యంలో పోతన్నముద్ర ఏమాత్రం లేకపోవడమే. ఇంకా 'హాలికులైననేమి, గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి' అంటూ ప్రాసస్థానంలో గుప్పించిన అనుప్రాస సౌరభం ఇందుకు సాక్ష్యం.

అవతారిక దృష్ట్యానే కాక భాగవత కథల్లో ఉపాఖ్యానాల్లో పోతన్న మూలాతిరిక్తంగా పెంచిన పట్టులను బట్టీ, పేర్చిన పద్యాలను బట్టీ, అతని సత్త్వరమణీయమూర్తి సాక్షాత్కరిస్తుంది. గజేంద్రుని సంశయంలో, ప్రహ్లాదుని నిశ్చయంలో, గోపికల ఉద్వేగంలో, వామనుని ఉత్తేజంలో - ఇవేకాక నవవిధ భక్తిలతల బహుముఖ వికాసంలో, భక్తిరసతరంగితమైన పోతన్న చిత్తవృత్తి పలువిధాలా ప్రస్ఫుట మవుతుంది. వ్యాసభగవానుని భాగవత కోశాన్ని సైతం క్షణకాలం మరచిపోయి, ఆయా భాగవతుల శ్రవణకీర్తనలకు లోనై ఆ పాత్రలన్నీ తానై పరవశించి, పద్య సంఖ్యను పెంచి, ప్రతిభా శిఖరాలపై భాసించిన సన్నివేశాలు ఆంధ్ర భాగవతంలో కోకొల్లలు. అందుకే అంటున్నాను - అవతారికలోనేకాక ఆంధ్ర భాగవతంలో గూడా అడుగడుగున పోతన్న సాత్త్విక చిత్తవృత్తి, భక్తిభావనా ప్రవృత్తి వేయిరేకులతో విప్పారినవని.

నవవిధ భక్తులను కథాత్మకంగా ప్రపంచించిన ప్రథమ గ్రంథం వ్యాసభాగవతం. ఆ భక్తిరస ఘట్టాలను ఇంతకు రెండింతలుగా విస్తరించి తొలిసారిగా మధుర భక్తికి పచ్చల తురాయిని కూర్చిన తెలుగు కావ్యం పోతన్న భాగవతం. ప్రహ్లాదుని నోట వ్యాసుఁడు పలికించిన భక్తిశాఖ లివి -

"శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనమ్‌"
దీనికి పోతన్న చేసిన తెలుగు సేత ఇది -

"తనుహృద్భాషల సఖ్యమున్‌ శ్రవణమున్‌ దాసత్వమున్‌ వందనా
ర్చనముల్‌ సేవయు నాత్మలో నెఱుకయున్‌ సంకీర్తనల్‌ చింతనం
బను నీ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్‌ హరిన్‌ నమ్మి స
జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలతున్‌ సత్యంబు దైత్యోత్తమా!"
ప్రహ్లాదుడు, గజేంద్రుడు, అంబరీషుడు, కుచేలుడు, ధ్రువుడు, అక్రూరుడు, రుక్మిణి, గోపికలు - ఆయా భక్తిశాఖల విరబూసిన ప్రసూనాలు. ప్రహ్లాదుడూ, రుక్మిణీ, గోపికల వంటి పాత్రలలో పోతన్న పరమ భాగవత సత్త్వం, అరీణ భక్తితత్త్వం శబలసుందరంగా భాసిస్తాయి. ఇది చెప్పాలని ప్రహ్లాదుని ముఖతః ఎన్నెన్ని భంగులలో ఎన్నెన్ని ఫణుతులలో చెప్పించినాడు పోతన్న!

"మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు"

అంటాడు. మరోసారి -

"కంజాక్షునకు గాని కాయంబు కాయమే"

అంటాడు. ఇంకోసారి -

"కమలాక్షు నర్చించు కరములు కరములు"

అంటూ లాటానుప్రాసల్లో ఉద్ఘాటిస్తాడు. ఆ 'అంబుజోదర దివ్యపాదారవిందాలు', ఆ 'చింతనామృతం', ఆ 'మత్తచిత్తం' ఎన్ని సార్లంటాడు! ఎన్ని తీర్లంటాడు! విసుగులే దా భక్తవరుని నోటికి. అది పునరుక్తిదోష మని అనిపించనే అనిపించదు పరవశించిన ఆలేఖినికి. ఇంతకూ పోతన్న రచించిన భక్తి పద్యాల్లో కోటికెక్కిన 'మందార మకరంద' పద్యం అటు వ్యాసునిదీ కాదు, ఇటు పోతన్నదీ కాదు. పాలకురికి సోమన్నది. సోమన్న పోతన్నకు పూర్వీకుడు. బమ్మెరకు సమీపంలో ఉన్న పాలకురికి వాస్తవ్యుడు. అతని చతుర్వేదసారంలోనూ, బసవ పురాణంలోనూ ఈ పద్యం పోలికలే ఉన్నాయి -

'రాకామలజ్యోత్స్న ద్రావు చకోర - మాకాంక్ష సేయునే చీకటి ద్రావ' (బసవ పురాణం)

అని సోమన్న అంటే

'పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం - బరుగునే సాంద్ర నీహారములకు'

అని పోతన్న అంటాడు.

'విరిదమ్మి వాసన విహరించు తేటి - పరిగొని నుడియునే ప్రబ్బలి విరుల' (బసవ పురాణం)

అని సోమన్న అంటే

'మందార మకరంద మాధుర్యమునఁ దేలు - మధుపంబు వోవునే మదనములకు'

అని పోతన్న అంటాడు. అయితే సోమన్నకు రాని కీర్తి ఈ పద్యంవల్ల పోతన్న కెందుకు వచ్చింది? అక్కడే ఉంది పోతన్న పోత. 'మందార' 'మకరంద' 'మాధుర్య' 'మధుప' 'మదనములు' - ఎన్నిమకారాల ప్రాకారాలు కట్టినాడు! పద్యాన్ని ఎంత ప్రాసాదరమ్యంగా నిలబెట్టినాడు! అక్షర రమ్యతలో నన్నయ్యను దాటి, ఆపై అంచులు ముట్టినాడు. తరువాతివా ళ్ళెవరైనా ఈ శైలిని అనుకరిస్తే జారిపడిపోవడమో, నీరుగారిపోవడమో జరిగే అంత సొంతపుంత చేపట్టినాడు. మరి 'కమలాక్షు నర్చించు కరములు కరములు' కూడా పోతన్న కొత్తగా చెప్పింది కాదు. భీమఖండంలో

శ్రీభీమనాయక శివనామధేయంబుఁ జింతింపనేర్చిన జిహ్వజిహ్వ
దక్షవాటీపురాధ్యక్ష మోహనమూర్తిఁ జూడంగనేర్చిన చూపుచూపు
దక్షిణాంబుధితట స్థాయిపావనకీర్తి చే నింపనేర్చిన చెవులుచెవులు
తారకబ్రహ్మవిద్యాదాతయౌదల విరులు పూన్పఁగ నేర్చు కరముకరము
ధవళకరశేఖరునకుఁ బ్రదక్షిణంబు నర్థిఁ దిరుగంగ నేర్చిన యడుగు లడుగు
లంబికానాయకధ్యాన హర్షజలధి మధ్యమునఁ దేలియాడెడు మనసు మనసు
అని శ్రీనాథు డెన్నడో అన్నదే. కాని లోకానికి తెలిసింది 'కమలాక్షు నర్చించు కరములు కరము'లే. ఈ ప్రాచుర్యానికి కారణం కూడా పోతన్న కూర్చిన పదబంధ తోరణమే.

నవవిధ భక్తుల్లో "శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మనివేదనం" - ఇవన్నీ ఒక పాదులో పుట్టిన మొలకలే. సఖ్యం మాత్రం వీటికంటే భిన్నతత్త్వం కలది. రుక్మిణికి శ్రీకృష్ణునిపట్ల గల రక్తికీ, భక్తికీ నేపథ్యం ఆత్మనివేదనం. అర్చన వందన స్మరణాదులు ఆ ఆత్మార్పణంలో నుంచి ఉదయించిన రేఖలు. కుచేలు డున్నాడు, అర్జును డున్నాడు. వీళ్ళది ప్రధానంగా సఖ్యభక్తి. అనుషంగికంగా ఆ సఖ్యం చుట్టూ స్మరణవందన పాదసేవనాదులు పరివేషించక పోలేదు. మరి మధుర భక్తికి మూలమేది? జీవాత్మ పరమాత్మల వియోగం. అఖండ పరమాత్మనుండి ఖండశః అంశతః విడివడిన జీవాత్మలు ఆ మూలాత్మను కలుసుకోవాలనే తపనమే భగవద్రతిభావనకు ప్రాతిపదిక. త్రేతాయుగంలో మునులు, ద్వాపర యుగంలో గోపికలు భగవద్విరహంలో సంతప్తలైన జీవాత్మలు. గోపిక లున్నారు. వాళ్ళకు ఇళ్ళూ, వాకిళ్ళూ ఉన్నాయి. కొందరికి పతులూ, సుతులూ ఉన్నారు. అయినా శారదయామినిలో యమునా తీరంలో బృందావనిలో గోపాలుని మురళీగానం ఆలకించగానే అన్నీ మరచి పరుగులు తీస్తారు. బృందావని చేరుకొని నందకిశోరుణ్ణి కానక రసోన్మాదంలో ఎలుగెత్తి పిలుస్తారు. ఆ మోహనమూర్తిని పదేపదే స్మరించుకొని ఇలా ఆక్రందిస్తారు -

"నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు కృపారసంబు పైఁ
జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడుమోమువాఁ డొకఁడు చెల్వలమానధనంబు దోచె నో
మల్లియలార! మీ పొదల మాటున లేఁడుగదమ్మ! చెప్పరే!"
మధ్యమధ్య ఆ మాధవుడు, ఆ గోపికా మనోభవుడు తళుక్కున మెరుస్తాడు. అంతలోనే అంతర్హితుడౌతాడు. అప్పుడు గోపికల వియోగవిధురహృదయాలు ఇలా సంభ్రమిస్తాయి -

"అదె నందనందనుం డంతర్హితుండయ్యెఁ - బాటలీతరులార! పట్టరమ్మ!
హేలావతులఁ గృష్ణ! యేల పాసితివని - యైలేయలతలార! యడుగరమ్మ!
వనజాక్షుఁ డిచటికి వచ్చి డాఁగఁడు గదా - చూతమంజరులార! చూడరమ్మ!
మానినీమదనుతో మారాక యెఱిఁగించి - మాధవీలతలార! మనుపరమ్మ!
జాతిసతులఁ బాయ నీతియె హరి కని
జాతులార! దిశలఁ జాటరమ్మ!
కదళులార! పోయి కదలించి శిఖిపింఛ
జూటుఁ దెచ్చి కరుణఁ జూపరమ్మ!"
సమస్త చరాచర జీవకోటికి అధినాధుడు మాధవుడు. ఆ మాధవుడే తమధవుడని భ్రమించినారు గోపికలు. ఆ భ్రమావరణమే వారి మనస్సుల మీద మోహయవనికలను కప్పింది. ఆ ముగ్ధప్రవృత్తే మధురభక్తికి మూలం. ఈ మధురభక్తిని రాసక్రీడాది వర్ణనంలో హృదయంగమంగా చిత్రించినాడు పోతన్న.

లోకంలో భక్తకవులు పలువు రున్నారు. వారందరు ప్రజాకవులు కాలేరు. ఒక తుకారాం, ఒక సూరదాసు, ఒక కబీరు, ఒక పోతన్న ప్రజాకవులుగా ప్రాచుర్యం పొందిన భక్తకవులు. మరి ప్రజాకవి ఎవడు? సామాన్యప్రజల జీవితసమస్యలను చిత్రించేవాడు. ఇది బాగా వాడుకలో ఉన్న అభిప్రాయం. ఈ దృష్టితో చూస్తే పోతన్న ప్రజాకవి కాలేడు. అతడు ప్రజల దైనందిన జీవితసమస్యలకు బొమ్మకట్టి చూపలేదు. భాగవతుల భక్తిభావ పరంపరలకు శ్రుతులు కూర్చి కృతులు అల్లుకున్నాడు. ఆ భాగవతుల్లో ప్రహ్లాదునివంటి ఆజన్మజ్ఞానులు ఉన్నారు. గజేంద్రుని వంటి అర్ధజ్ఞాను లున్నారు. కుచేలునివంటి ఆర్థికదుర్దశాపీడితులున్నారు. ఈభక్తుల స్థితిగతులు వేరైనా, వారి వారి సంస్కారమతులు వేరైనా, అందరినీ కలిపికుట్టే మూలసూత్రం ఒకటుంది. అదే ఆర్తి. అది జీవాత్మలు పరమాత్మకు నివేదించుకునే అలౌకికమైన ఆర్తి. భక్తపరమైన ఈ ఆర్తిని సార్వకాలీన సామాన్య ప్రజల ఆర్తిగా చిత్రించడంవల్లనే భక్తకవియైన పోతన్న ప్రజాకవియైనాడు. "కలడు కలం డనెడువాడు కలడో లేడో" అంటూ ఆందోళించినవాడు కరిరాజే కానక్కరలేదు, ఏ మూగజీవికైనా ఇది చెల్లుతుంది. "ఇందుఁ గలడందులేడని సందేహము వలదు" ఇది ఏ ప్రహ్లాద భాషితమో కానక్కరలేదు, ఏ దృఢసంకల్పునికైనా ఇది సరిపోతుంది. "ఊరక రారు మహాత్ములు" దీన్ని ఏ గర్గమునికో ముడివెట్ట నక్కరలేదు. ఇప్పటికీ ఏ మహానుభావుని రాకకైనా ఇది వర్తిస్తుంది. "ఎందరో మహానుభావులు" అన్నంత వ్యాప్తి పొందిన సూక్తి ఇది. అయితే ఈ సూక్తి సహజ గంభీర్యాన్ని కాస్తా వదలుకొని కాలంగడిచిన కొద్దీ ఛలోక్తిగా మారడం కూడా జరిగింది. అంటే సామెతలకోవలో చేరిందన్నమాట. ఒక కవి రచించిన పద్యపాదాలు సామెతలుగా, లోకోక్తులుగా చెలామణి కావడం కంటె ఆ కవికి అంతకు మించిన ప్రాచుర్యం ఏముంది? ఇలా లెక్కించుకుంటూ పోతే, పోతన్న వందలాది పద్యాల్లోంచి వేలకొద్దీ పాదాలను ఉదాహరించవలసివస్తుంది. ప్రాచీనాంధ్ర కవులలో బహుళంగా ఉదాహరింపబడుతున్న వాళ్ళల్లో ఇద్దరే ఇద్దరిని చెప్పుకోవాలి. ఒకడు పోతన్న. మరొకడు వేమన్న. వేమన్న అక్షరాలా ప్రజాకవి. అధిక్షేపం అతని ఆయుధం. సంఘసంస్కరణం అతని లక్ష్యం. అతని ప్రతిపద్యం ప్రజలజీవితాలకు సంబంధించిందే. అతని ప్రతి విసురు పచ్చని ప్రజాజీవనాన్ని తొలిచే చీడపురుగులకు సంబంధించిందే. ప్రజలభాషలో ప్రజల సమస్యలను చిత్రికపట్టి వేమన్న ప్రజాకవి యైనాడు. భాగవతుల భక్తిభావనలను సామాన్య ప్రజల ఆర్తికి పర్యాయంగా సమన్వయించి పోతన్న ప్రజాకవి యైనాడు. బమ్మెరకు వెళ్ళి అక్కడి పొలాల నడిగితే చెబుతాయి - "ఇదిగో! ఇది పోతన్నగుడి! అదిగో! అది మల్లన్నమడి" అని. పోతన్న గుడి నిజంగా గుడి కాదు, పాతుకొని ఉన్న ఒక రాతిపలక. ఆరాతిపలకను పోతన్నకు ప్రతిరూపంగా నేటికీ అక్కడి పల్లీయులు భావించు కుంటున్నారంటే ఇప్పటికీ పోతన్న ఎంత సజీవంగా ఉన్నాడో ఊహించుకోవచ్చు. మరి మల్లన్నమడి మాటేమిటి? ఈ పోతన్న కొడుకైన రైతన్న దున్నిన పొల మది.

కవితాకేదారాన్ని పండించిన హాలికుడుగా అన్నివేళలా తలచుకోవడానికి అనువైన పద్యఖండాలను అందించిన ఆదర్శమానవుడుగా పోతన్న చిరంజీవి. భావికవులను బహూకరించిన ఆ పరమ భాగవతునికి తప్ప అంతంత మాత్రంవానికి ఉంటుందా ఇంతటి సముజ్జ్వల భావి. ఎప్పుడో పొట్టివడుగైన వామనమూర్తి ఇంతై అంతై అంతంతై మూడు లోకాలను ఆక్రమించినట్లు - ఎక్కడో బమ్మెరవంటి చిట్టూరిలో పుట్టిన పోతన్న మూడు కాలాలను ఆకట్టుకునే అమృత కృతులను నిర్మించగలిగినాడు. అవతారికలో అతడు నివేదించుకొన్న

ఈ పద్యం చూడండి -

"ఒనరన్‌ నన్నయ తిక్కనాది కవు లీయుర్విం బురాణావళుల్‌
తెనుఁగుం జేయుచు మత్పురాకృతశుభాధిక్యంబు తా నెట్టిదో
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్‌ దీనిం దెనింగించి నా
జననంబున్‌ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్‌"
భాగవతాన్ని తెనిగించి పోతన్న తనజన్మను సఫలం చేసుకున్నాడు. ఆ భాగవత పద్యాలను పఠించి తెలుగు ప్రజలు తమ జీవితాలనే పండించుకున్నారు.

సూచికలు :
1
ఫుల్ల సరోజ నేత్రయల పూతన చన్ను విషంబు ద్రావితం
చల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెదవేల తింత్రిణీ
పల్లవయుక్తమౌ నుడుకుఁ బచ్చలిశాకము జొన్నకూటితో
మెల్లన నొక్కముద్ద దిగమ్రింగుము నీవన గాననయ్యెడిన్‌.

సిరిగలవానికిఁ జెల్లును
తరుణుల పదియాఱువేలఁ దగఁ బెండ్లాడన్‌
తిరిపెమున కిద్ద ఱాండ్రా
పరమేశా! గంగ విడుము! పార్వతి చాలున్‌.

2
ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్‌
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరముఁ బాసి కాలుచే
సమ్మెటవాటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెరపోతరా జొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్‌.

3
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ప్రతినిబట్టి 'సమ్మెటవాటు'లే అనుకోండి.

04.చలం - స్త్రీ - భావన🌐


 చలం
స్త్రీ - చలం  చేసినంత ఆలోచన ఇంకా ఎవరు చేయలేదు.( స్త్రీ - స్వేచ్చా - బాధ్యత, చలం దృష్టి లో  విడదీయరాని అంశాలు )   

*మీరు చలాన్ని విమర్శించిన దానికన్నా ఎక్కువగా చలం తనని తాను విమర్శించుకున్నాడు.
  1. చలాన్ని ఇవాళేదో ప్రత్యేకంగా నిర్వచించాలనీ కూడా కాదు, లేదా సమర్ధించాలని కూడా కాదు. కానీ గమనించండి మీరు, చలం వివాహ వ్యవస్థని నమ్మిన వాడు కాదు. దాన్ని ఆచరించిన వాడూ కాదు. తన కూతుళ్లకి ఎప్పుడూ ఆయన పెళ్ళి ఊసు తలపెట్ట లేదు సరికదా పెళ్ళిళ్ళు చేసుకోకండని వారితో చెప్పిన వాడు. తాను నమ్మిన వాటినే ఆయన ఆచరించి బతికాడు. వివాహవ్యవస్థ మీద తిరుగుబాటు చేసిన వ్యక్తిని మనం ఆ ప్రమాణాలతో చూసే వీలు లేదు. చలం రాసిన వాటిని మీరు ఒప్పుకోకపోవచ్చు. చలాన్ని మీరు విమర్శించవచ్చు. కానీ చలం ఒక గృహస్తు లాగా బతకడానికో, అలాంటి ఒక విషయాన్ని “ఆదర్శం” గా చూపించడానికో ఏనాడూ ప్రయత్నం కూడా చేయలేదు. అందుకోసం ఆయన తన రచనలు చేయలేదు. 

     ఆయన వెనకటి రచనల ప్రస్తావన చెసినప్పుడు చలం మళ్ళీ ఆ రచనలనే చేయవలసి వస్తే అంతకన్నా మరింత ఘాటుగా ఎలా రాయాలా అని ఆలోచిస్తానని అన్నాడు! అలాంటి వారితో కలిసి జీవించడం ఆయన భార్యకి అంత సులువైన విషయమేమీ కాదు, నిజమే. అయినా, ఆవిడ మీరు ఆశించినట్టు గా ఎందుకని “విముక్తి” అనుకుంటూ ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోలేదో! మీరు చూడని అంశమేదో ఆమె తన భర్తలో బహుశా చూడగలిగిందేమో మరి! లేకపోతే రంగనాయకమ్మ గారు అన్నేళ్ళు చలంతో సహజీవనం చేయగలిగేది కాదు కదా?
    మీరు చలాన్ని విమర్శించిన దానికన్నా ఎక్కువగా చలం తనని తాను విమర్శించుకున్నాడు. ఆయన తన ఆత్మకధని మొదలుపెడుతూ అన్న మాటలని ఎప్పుడైనా చదివిచూడండి. ఆయన అభిప్రాయాలు ఆయన రాసిన “బిడ్దల శిక్షణ” లోనీ “స్త్రీ” లోనీ ఆయన ఆత్మకధ లోనీ స్పష్టం గానే ఉన్నాయి.
    చలం వివాదాస్పదం కావడానికి ఆయన “శృంగారం” గురించి రాయడం కారణం కాదు. చలం కన్నా ముందు తెలుగు సాహిత్యం నిండా ఉన్నది శృంగారమే!! వాటిని ఎవరూ తిట్టలేదేం? ఎందుకంటారూ?? ఎందుకంటే వాటి పాఠక వర్గం లో స్త్రీలు లేరు. కనీశం స్త్రీలు ఉండొచ్చును అన్న స్పృహ కూడా ఆ ప్రాచీన “శృంగార” రచయితలకి లేదు. ప్రాచీనమేం ఖర్మ ఆధునిక రచయితలకీ చాలామందికి లేదు. ఆనాటి రచనలన్నీ పురుషుల కోసం పురుషులు రాసుకున్న శృంగార రచనలు. కొద్దో గొప్పో స్త్రీలు రాసినా వారు కూడా ఆ శృంగార చట్రాన్నే ఒప్పేసుకుని ఆ తరహాలోనే తాము సైతం రచించిన శృంగారం! కానీ చలం రచనల్లోని స్త్రీపురుష సంబంధాలు అంతకు మునుపటి రచనలలో లేనివి. స్త్రీల అనుభవం గురించిన ఆలోచనలని తొలిగా సాహిత్యంలో ప్రస్తావన చేసిన రచయిత వెంకటచలంగారే ! ఆయన రాసిన వాటిని బాహాటంగానో, రహస్యంగానో ఎలాగో అలాగ ఆయన కాలం నాటి స్త్రీలు మాత్రం స్వయంగా చదివారు. చదవడమే కాదు వాటిని వారు నచ్చుకున్నారు. ఆ రాసిన వ్యక్తిని కలవడానికీ ఆయనని చూడడానికీ ఆయనతో మాట్లాడడానికీ తెలుగు సమాజం లోని స్త్రీలు స్వతంత్రించి ధైర్యంగా ప్రయత్నం కూడా చేశారు. దీనినే “ప్రభావితం కావడం” అని అంటారు. ఇలా కేవలం “శృంగారం” రాయడం మాత్రమే కాక ఆయా స్త్రీలు మోస్తున్న కుటుంబవ్యవస్థ లోని లోటుపాట్లని చలం బయట పెట్టడం వలన, వాటిని చదివిన ఆడవాళ్ళు ఎక్కడ కుటుంబాలని వదిలి వెళ్ళిపోతారో అని తెలుగు సమాజం కలత చెంది చలాన్నీ, అతని రచనలనీ నిందించడం జరిగింది. కానీ పాపం! ఏదీ? చలం రచనలని చదివి ఏ భార్యా కుటుంబాలని వదిలి వెళ్ళిపోలేదు. చివరికి చలం భార్యతో సహా :)

    rama bharadwaj వారి సౌజన్యంతో 

    స్త్రీ ఒక తల్లికి కూతురు, ఒక శిశువుకు తల్లి, ఒక అన్నకు చెల్లి, ఒక తమ్మునికి అక్క, ఒక పురుషునికి భార్య, ప్రియురాలు, ఒక అత్తకు కోడలు. ఇలా స్త్రీకి ఎన్నో అవతారాలు. పురుషునితో సమానంగా ఇప్పుడు స్త్రీలు కూడ ఆఫీసులలో, కంపెనీలలో, కళాశాలలో పని చేస్తున్నారు, కానీ తక్కువ వేతనంతో. సంఘంలో స్త్రీని ఇంకా ఒక ఆటవస్తువుగానే కొందరు భావిస్తున్నారు. స్త్రీ హృదయంలో కలిగే భావాలు, క్షోభలు, సుఖ దుఃఖాలు, కన్నీళ్లు, ప్రేమలు, కామాలు - ఇవన్నీ కవితకు మంచి సారవంతమైన క్షేత్రం. ఒక వంద సంవత్సరాలుగా స్త్రీల కవితలు ఎంతగానో ముందడుగు వేసింది. స్వాతంత్ర్యానికి ముందు ముగురమ్మలు దీనికి మూలకారకులు. వారు - విశ్వసుందరమ్మ, బంగారమ్మ, సౌదామిని. మచ్చుకు వారి కవిత ఒకటి కింద ఇస్తున్నాను. సౌదామినిగారి “దురదృష్టాన్ని” చదివిన తరువాత కళ్ల నీళ్లు బెట్టుకోని వాళ్లు అరుదుగా ఉంటారు.
    అరమరలేని మన చిరతర స్నేహరుచుల్
    కురిసిన వెన్నెలలా, అరవిరిసిన మల్లియలా
    మనమున నెవ్వగలే మాసెను ఘనమగు నెయ్యములో
    మెరపుల గుంపేమో అది కరగని వెలుగేమో
    దినములు నిముసములై చనియెను తిన్నని నడకలతో
    కన్నుల తళుకేమో అది పున్నెపు ప్రోవేమో
    జీవితమున కంతా అది చెలువపు నిగ్గేమో
    పరమ ప్రేమకు చిహ్నమైన తెలి వెన్నెల కాంతుల సన్నపు తళుకేమో
    - విశ్వసుందరమ్మ, స్నేహరుచి
    కను మూసి లేచాను వెనుదిరిగి చూశాను
    కనలేదు ఆ జంట, వినలేదు ఆ జాడ
    గుండె గుబగుబ లాడెను
    నా గొంతు
    ఎండి గుటకడదాయెను
    పిలిచాను పిలిచాను అలసిపోయాను
    అలసిపోయిన గుండె అట్టె ముడిపోవ
    ఆకాశమున కెగిరితి
    అక్కడా
    అంధకారమె చూసితి
    కేక వినబడదాయె చూపు కనబడదాయె
    అంధకారములోన అట్టె రెక్కలు ముడిచి
    అవనిపై బడితిని
    అక్కడా
    అంధకారమె గంటిని
    - బంగారమ్మ, తమస్సు
    చూచితి మెంతో దేశము
    సుఖము, శాంతి దొరకునొ యని
    మునిగితి మెన్నో నదులను
    మోక్షము చేపట్టుద మని
    ఎక్కితి మెన్నో కొండల
    నీశ్వరు దర్శింతా మని
    మ్రొక్కితి మెన్నో వేల్పుల
    కొక్క పండు వర మిమ్మని
    నోచితి మెన్నో నోములు
    కాచి బ్రోచు నని పార్వతి
    కడకు దేవి దయచేతను
    కంటిమి రత్నములు రెండు
    బతుకు కలంకారముగా
    వాని దాచ చేతగాక
    ఎచటనొ పోగొట్టుకొంటి
    మెంతటి దురదృష్టముననొ
    - సౌదామిని, దురదృష్టము
    అరవైయవ దశకమునుండి స్త్రీల కవిత్వము, స్త్రీవాద కవిత్వము తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొన్నది. జయప్రభ, ఓల్గా, రేవతిదేవి, ఈశ్వరి, సావిత్రి వంటి కవులు ఒక కొత్త చేవను, బలాన్ని, దృక్పథాన్ని సాహిత్యంలో సృష్టించారు. అమెరికాలాటి విదేశాల్లో ఉండే స్త్రీలు కూడా ఈ ఉద్యమంలో ముఖ్య పాత్రలే. వీరి కవితలను చదువుతుంటే ఒక కథను చదివేలా అనుభూతి కలుగుతుంది. కింద కొన్ని కవితాభాగాలను ఉదాహరణలుగా ఇస్తున్నాను.
    ….
    ఇద్దరి రక్తమూ ఎర్రగానే వుంది
    ఇద్దరి రక్తమూ వేడిగానే వుంది
    ఇద్దరి రక్తమూ ఉప్పగానే వుంది
    అంతే
    ఆ తర్వాతెప్పుడూ అనుకరించలేదు నా పూజ్య పూర్వీకుల్ని
    ఆలోచించేవాణ్ణి శాస్త్రీయంగా నా మేధస్సుతో నేను
    ఆచరించేవాణ్ణి ఏది సమంజసమనిపిస్తే దాన్ని
    అనుసరించేవాణ్ణి ఏది యోగ్యమనిపిస్తే దాన్ని
    - పెళ్ళకూరు జయప్రద, నేస్తం ఆలోచించు
    అది రాత్రి సరిగ్గా రెండు నిలువు గీతల సమయం
    కొబ్బరాకుల నిలువు పాపిట మీద
    మంచు బొట్టొకటి మిసమిసా నాకేసి చూస్తోంది
    ఎదలోపల ఎక్కడో ఖరీదైన జ్ఞాపకం కాలుతోంది
    గుండెలోపల పండిన మొగలిరేకు గుచ్చుకొన్నట్లు
    చివ్వుమన్న బాధ రివ్వుమన్న సువాసన

    - కొండేపూడి నిర్మల, నిద్రపట్టని రాత్రి
    పురుషుడికి అపారమైన శక్తి సామర్థ్యాలున్నాయి
    అందచందాలున్నాయి
    గుణగణాలున్నాయి
    తెలివితేటలున్నాయి
    అవన్నీ పురుషుడికి
    తల్లిగా
    ప్రేయసిగా
    స్త్రీ ఇస్తుంది
    అన్ని ఇచ్చి
    చివరికి
    మగాడి చేతిలో
    ఆటబొమ్మవుతుంది
    - రేవతీదేవి, స్త్రీ
    పాఠం ఒప్పజెప్పకపోతే
    పెళ్లి చేస్తానని
    పంతులుగారన్నప్పుడే భయం వేసింది
    ఆఫీసులో నా మొగుడున్నాడు
    అవసరమున్నా సెలవివ్వడని
    అన్నయ్య అన్నప్పుడే
    అనుమానం వేసింది
    వాడికేం మహారాజని
    ఆడా మగా వాగినప్పుడే
    అర్థమయిపోయింది
    పెళ్లంటే పెద్ద శిక్షని
    మొగుడంటే స్వేచ్ఛభక్షకుడని
    మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే
    మమ్మల్ని విభజించి పాలిస్తోందని
    - సావిత్రి, ఒక ఆడపిల్ల స్వగతం
    నీకూ మంచి రోజు లొస్తున్నాయిరా కన్నా
    ఆడదిగా పుట్టనని అడవిలో మానైనా కాలేదని
    విలపించే రోజులు
    పోతున్నాయిలే తల్లీ
    ఎందుకంటే
    నీవు అమ్మ పొట్టలోంచి
    బైటికే రావుగా
    - ఈశ్వరి
    ఏమిటీ అలా వెతుకుతున్నావు
    ఆ రంగుటద్దాలు తీసేసి
    నా కళ్లు పెట్టుకొని
    నీలోకి చూసుకో
    తెలుస్తుంది -
    నీలో సగం నేనేనని
    - ఇందిర కొల్లి, నీవు నేను
    గుడిపాటి వెంకటాచలం (1894–1979), సాహిత్య లోకంలో 'చలం'గా సుప్రసిద్ధుడు, ఆధునిక తెలుగు సాహిత్యంలో విప్లవాత్మక రచయిత, వేదాంతి, సంఘ సంస్కర్త మరియు స్త్రీవాద ఆలోచనలకు బీజం వేసిన అసాధారణ వ్యక్తి. ఆయన జీవితం, సాహిత్య రచనలు, సామాజిక దృక్పథం ఒకదానితో ఒకటి ముడిపడి, తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. 

            🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
    చలం గారు 1894 మే 18న మద్రాసులో కొమ్మూరి సాంబశివరావు, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వారి తాత గారు గుడిపాటి వెంకట్రామయ్యకు దత్తత వెళ్లడంతో ఆయన గుడిపాటి వెంకటాచలంగా మారాడు. తెనాలిలో ఆయన బాల్యం సాగింది. చిన్నతనంలోనే తండ్రి నుండి కఠిన శిక్షలు ఎదుర్కొన్నాడని, తల్లి తాత ఇంట్లో ఎక్కువగా ఉండేదని ఆయన 1972లో రాసిన ఆత్మకథ "చలం"లో వివరించాడు. ఈ అనుభవాలు ఆయన మానసిక ఆలోచనలపై గాఢ ప్రభావం చూపాయి.
    .......
    చలం  గారు వృత్తిరీత్యా  ఉపాధ్యాయుడు. చలం గారి రచనలు మిగతా రచయితల రచనలకు భిన్నమైనవి. ప్రత్యేకించి వీరూ రాసే వచనం లో ఎక్కువ కవితాత్మంగా వుండి ఆసక్తీకరంగా చదివించేస్తుంది. చలం కు ఆత్మకథలు అంటే ఇష్టముండదు. అయినా సరే తనమీద తానే ఒక పుస్తకాన్ని వ్రాసి (1972), దానికి "చలం" అని పేరు పెట్టాడు. వారి మాటలోనే చెప్పాలంటే 
    ఆత్మకథలంటే నాకసహ్యం....

    ఆత్మకథ వ్రాయడమంటే తను లోకానికి ముఖ్యమైన మనిషైనట్టు, తానేదో ప్రజలకి తీరని ఉపకారంచేసినట్టు,
    తన సంగతి చెప్పుకోకపోతే లోకానికి తన గొప్ప తెలియనట్టు, తెలియకపోతే లోకానికి నష్టమైనట్టు అనుకొంటున్నాడన్న మాట,రాసినవాడు ఎందుకు పుట్టానా పుట్టినవాణ్ణి చప్పున చావక ఎందుకింత కాలం తన పరిసరాలని ఇంత కల్మషం చేశానా అనుకునే నావంటివాడు తనకథ సిగ్గులేకుండా
    చెప్పుకొంటున్నాడంటే ఏమాత్రం క్షమించదగిన విషయం కాదు.
    .....
    నిజానీకీ సంప్రదాయ కుటుంబం లో పుట్టిన చలం మొదట్లో 
    నిష్ట గరిష్టుడిగా వుండేవాడు. తన చెల్లెలు పెళ్ళి అర్ధంతరంగా ఆగిపోవడం. ఇంట్లో కలతలు ఇవ్వన్ని కూడా తనను సంప్రదాయ నిరసన కు దారితీసింది. స్త్రీల పట్ల న్యాయ విచక్షణ వైపు మళ్ళించింది.
    ......
    ఇక చలం రచనల్లో అతను వ్యక్తపరచిన భావాలు, ప్రతిపాదించిన విషయాలు, అప్పటి సమాజం మీద ఎంతగానో ప్రభావం చూపాయి. అతను స్త్రీ స్వేచ్ఛ పేరుతో విశృంఖల జీవన విధానాన్ని ప్రచారం చేస్తున్నాడని తీవ్ర విమర్శల పాలు అయినాడు. అంతేకాదు వ్యక్తీగతంగా చలం గురించి తెలిసిన వారూ ఎవ్వరూ ఆతనినీ దగ్గరకు రానిచ్చేవారూ కాదట. పోనీ కుటుంబ సభ్యుల జీవితాలు అయిన సరిగ్గా ఉన్నాయా అంటే అదీ కూడా అంతంతా మాత్రమే. వీరి పెద్ద కొడుకు (రవి ) చిన్నతనంలోనే జబ్బు చేసి మరణించాడు. రెండవ కొడుకు (వసంత్ ) దురలవాట్లకు బానిసై, ఇల్లు వదలి ఎటో వెళ్ళి పోయాడు. ఇక కూతురు సౌరిస్ అయితే వివాహమే  చేసుకోలేదు. సన్యాసినిగా మారింది. ( ఈవిడే చలం చనిపోయాక దాహన సంస్కారాలు జరిపించారు) ఇలాంటి సమస్యలున్న చలం గారు పిల్లలను ఎలా పెంచాలో అన్న విషయం మీద " *బిడ్డల శిక్షణ*  అనే పుస్తకం రాయడం విచిత్రం!

    • చలం గారి జీవితం ఒక అసాధారణ ప్రయాణం.....

    చలం విద్యాభ్యాసం సాంప్రదాయికమైనది కాగా, ఆయన 
    ఆంగ్ల సాహిత్యం, పాశ్చాత్య తాత్విక రచనల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఈ జ్ఞానం ఆయన రచనల్లో స్వేచ్ఛ, స్త్రీ సమానత్వం, సామాజిక నీతి వంటి అంశాలను ప్రశ్నించే ధోరణిని పెంపొందించింది.

    • వ్యక్తిగత జీవితం.....

    చలం వ్యక్తిగత జీవితం వివాదాస్పదమైనది. ఆయన వివాహం రంగనాయకమ్మతో జరిగింది, కానీ ఆయన ప్రేమ, స్త్రీ-పురుష సంబంధాలపై రాడికల్ ఆలోచనలు కుటుంబ జీవితంలో ఒడిదొడుకులను తెచ్చాయి. ఆయన పెద్ద కొడుకు రవి చిన్నతనంలోనే అనారోగ్యంతో మరణించాడు, మరొక కొడుకు వ్యసనాలకు లోనై ఇంటిని వదిలిపెట్టాడు, కూతురు సౌరీస్ సన్యాసినిగా మారింది. ఈ వ్యక్తిగత దుర్ఘటనలు చలం జీవితంలో ఒంటరితనం, మానసిక సంఘర్షణలను జోడించాయి. చలం జీవితంలో చివరి దశలో ఆధ్యాత్మికత వైపు మొగ్గాడు. నాస్తికవాది, హేతువాదిగా మొదట్లో ఉన్న ఆయన, రమణ మహర్షి ఆశ్రమంలో అరుణాచలంలో స్థిరపడ్డాడు. ఈ ఆధ్యాత్మిక మలుపు ఆయన రచనల్లో కూడా కొంత ప్రతిఫలించింది.

    • సాహిత్య జీవితం: విప్లవాత్మక రచనలు.....వారి శైలి మరియు ఇతివృత్తాలు....

    చలం గారి రచనలు నవలలు, కథలు, నాటకాలు, వ్యాసాలు, కవితలు, ఉత్తరాలు, ఆధ్యాత్మిక రచనలు వంటి వివిధ రూపాల్లో విస్తరించాయి. ఆయన అత్యంత ప్రసిద్ధ రచనల్లో కొన్ని:

    • చలం రచనలు ....

    * 1) నవలలు....

    1) మైదానం (1928)
    2) అరుణ (1939)
    3) వివాహం (1928)
    4) శశిరేఖ (1921)
    5) దైవమిచ్చిన భార్య (1923)
    6) అమీనా (1924)

    *2) నాటకాలు....

    1) పూరురవ    2)  పద్మరాణి
    3) వేలియాలి అబద్దాలు
    4) చిత్రాంగి       5) జయదేవ
    6) శశాంక  7) జానకీ వేదన (రష్యన్ భాష లో )

    *3) కథలు.....

    1) మా కర్మ ఇట్లా కాలింది (1925)
    2) మధుర మీనాక్షి (1925)
    3) విడాకులు (1938)
    4) కన్నీటి కాలువ (1924)
    5) హంపీ కన్యలు
    6) సినిమా జ్వరం
    7) చక్కనమ్మ కథ (నార్వే భాషలో)
    8) ఓ పూవు పూసింది

    * 4) ఇతరములు* :-
    1) సుధ (కావ్యం )
    2) విషాదం ( వ్యాస సంపుటి )

    చలం రాసిన దోషగుణం కథ ఆధారంగా " గ్రహణం" అనే సినిమా వచ్చింది. దీనికీ  ఇంద్రగంటి మోహన్కృష్ణ  దర్శకులు. అలాగే  "మైదానం" నవలను తనికెళ్ళ భరణి గారు సిన్మా తీయాలనీ ప్రయత్నించారు. కానీ ఎందుకో అదీ కార్య రూపం దాల్చలేదు.
    .....
    చలం గారి రచనలు స్త్రీల జీవితాలు, సమాజంలో వారు ఎదుర్కొనే శారీరక, మానసిక హింసలు, స్త్రీ స్వేచ్ఛ, ప్రేమ, సంబంధాలు, సామాజిక హిపోక్రసీ వంటి ఇతివృత్తాల చుట్టూ తిరుగుతాయి. ఆయన శైలి సహజమైనది, భావోద్వేగంతో కూడినది, తాత్విక లోతును కలిగినది. ఆయన భాషలో అసాధారణమైన సౌందర్యం, స్వేచ్ఛ ఉండేవి, ఇది సమకాలీన రచయితలను కూడా ఆకర్షించింది

    • స్త్రీవాద దృక్పథం.....

    చలం రచనలు స్త్రీల సమస్యలను కేంద్ర బిందువుగా చేసుకున్నాయి. ఆయన స్త్రీ స్వేచ్ఛ, సాధికారత అవసరాన్ని గట్టిగా ప్రతిపాదించాడు. "మైదానం" నవలలో రాజేశ్వరి అనే పాత్ర సాంప్రదాయిక బంధనాలను తెంచుకుని స్వేచ్ఛను ఎంచుకోవడం ఆనాటి సమాజంలో తీవ్ర చర్చను రేకెత్తించింది. ఈ రచన సాంప్రదాయ వాదుల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, స్త్రీ స్వాతంత్ర్యానికి ఒక బలమైన స్వరంగా నిలిచింది.
    ......
    చలం గారి రచనల్లో స్త్రీ-పురుష సంబంధాలు, ప్రేమ, శృంగారం గురించి బహిరంగంగా చర్చించడం ఆనాటి సమాజంలో విప్లవాత్మకం. ఆయన స్త్రీలను గౌరవించాలని, వారి ఆలోచనలకు విలువ ఇవ్వాలని పదేపదే నొక్కి చెప్పాడు. అయితే, ఈ బహిరంగ చర్చ సమాజంలో అపార్థాలకు దారితీసింది, ఆయన రచనలను "బూతు సాహిత్యం"గా ముద్రవేసింది

    • మ్యూజింగ్స్: తాత్విక ఆలోచనల సంగ్రహం.....

    చలం రచనల్లో "మ్యూజింగ్స్" ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. 1937-1955 మధ్య రాసిన ఈ వ్యాస సంపుటి ఆయన తాత్విక ఆలోచనలు, సామాజిక విమర్శ, వ్యక్తిగత అనుభవాల సమ్మేళనం. గాంధీయిజం నుండి కమ్యూనిజం వరకు, స్త్రీ-పురుష సంబంధాల నుండి ఆధ్యాత్మికత వరకు విస్తృత అంశాలను చర్చించాడు. ఈ రచనలో ఆయన సమాజంలోని మాయమైన పొరలను చీల్చి, సత్యాన్ని బహిర్గతం చేసే ప్రయత్నం చేశారు.

    • సమాజంపై ప్రభావం మరియు వివాదాలు.....సామాజిక ప్రభావం.....

    చలం రచనలు తెలుగు సమాజాన్ని ఒక తుఫానులా ఊపేశాయి. ఆయన స్త్రీ స్వేచ్ఛ, సామాజిక హిపోక్రసీ, కట్టుబాట్లపై చేసిన విమర్శలు యువతను ఆలోచింపజేశాయి. ఆయన రచనలు బహిరంగంగా చదవడానికి సమాజం భయపడిన రోజుల్లో కూడా, ఆసక్తిగల పాఠకులు రహస్యంగా చదివేవారు. చలం సాహిత్యం స్త్రీల హక్కుల గురించి, సామాజిక సంస్కరణల గురించి చర్చలను రేకెత్తించింది

    • చలం  గారి కవిత్వం.....

    ఈ విషయం కు వస్తే వీరి కవితలలోని తాత్వికత శైలి అందరినీ విస్మయపరుస్తుంది. వీరి  రచనాశైలీ ఇతివృత్తం ప్రభావితం గా వుంటుంది.

    చలం కవిత్వ నిషాకి మచ్చుకి కొన్ని పంక్తులు…

    • వానరాత్రి కవితలో ఏమంటారో చూడండి…

           ప్రపంచాన్ని తుడిచేద్దామన్నట్లు
            వీస్తోంది గాలి
            నల్లని రాత్రి ఇంకా నల్లని
            మబ్బు వస్త్రాలు కప్పుకుని ఏడుస్తోంది
             హోరుమని అరుస్తో వాన
             తలుపులు మూసి దీపం వెలిగించుకున్న
             వాన లోపలికి వస్తానని పంతం పట్టి
              తలుపు మీద ఈడ్చి కొడుతోంది
             తెరవమని కొంచం మర్చిపోతుంది
             మళ్ళీ నేను గ్యాపకం వొస్తాను గావును
             దబదబా బాదుతుంది
             నా విరహ బాధని
             ఈ రాత్రిలో కలిపెయ్యలేను?

    వీరి కవిత్వం సామాన్యంగా ఆలోచిస్తే అర్ధం కాదు. స్థూలంగా అర్ద్రత తో రాసే వీరి కవిత్వం అసామాన్యం. బసవరాజు అప్పారావు గారనట్లు  ఒక గొప్ప కవిత్వపు పంక్తి కొసం నూరు డబ్బాల చెత్త రాస్తాడు అనడం లోనే చలం ప్రత్యేకత తెలుస్తుంది. ఎంతో మంది ఠాగూర్ "*గీతాంజలి*" నీ తెలుగు లో అనువదించారు. అయినప్పటికీ చలం తన శైలి లో రాసిన అనువాదమే ఇప్పటికీ ప్రత్యేకమైనదిగా  తెలుగు సాహితీ వేత్తలు భావిస్తారు.

           "వొంటి పై రాజ వస్త్రాలు
            మెడలో బంగారు హారాలు
            ధరించిన బాలుడికీ
            ఆటలో సంతోషం ఎట్లా కలుగుతుంది
            ప్రతి అడుగునా ఆతని దుస్తులు
           అతనికీ అడ్డు పడతాయి" 

           " నా పాట అలంకారాల్ని విసర్జించింది
             నగల్ని చీరల్ని చూసీ గర్వపడదు
             ఆభరణాలన్ని మన
             ఐక్యన్నీ చేరుపుతాయి
            నీకూ నాకు మధ్య అవి అడ్డం
              నీ రహస్య వాక్కుల్ని వినపడకుండా
              చేస్తుంది గల గల*"

    • చలం రచనల పై *పరిశొధనలు* కూడా జరిగాయి...

    1) చలం నవలలు - సామాజిక చైతన్యం - మైనవరం ఈదారెడ్డి
    2) చలం సాహిత్యం అక్షరాభిషేకం - గొర్రెంపాటి వెంకట సుబ్బయ్య.

    • వివాదాలు.....

    చలం రచనలు సమాజంలో తీవ్ర వివాదాలను సృష్టించాయి. ఆయన స్త్రీ స్వేచ్ఛ పేరుతో "విశృంఖల జీవన విధానాన్ని" ప్రచారం చేస్తున్నాడని, ఆయన రచనల్లో అశ్లీలత ఉందని విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలు ఆయనను సామాజికంగా ఒంటరిని చేశాయి. సమాజం ఆయనను అపార్థం చేసుకున్నప్పటికీ, ఆయన తన ఆలోచనలను ధైర్యంగా వ్యక్తం చేశారు.
    ......
    విశ్వనాథ సత్యనారాయణ వంటి సాంప్రదాయవాద రచయితలు చలం రచనలకు వ్యతిరేకంగా "చెలియలికట్ట" వంటి రచనలు చేశారు. అయినప్పటికీ, విశ్వనాథ సత్యనారాయణ చలం భాషా నైపుణ్యాన్ని ప్రశంసించారు, "తెలుగు రచయితల కంటే చలంకు భాష బాగా వచ్చు" అని అన్నారు

    • ఆధ్యాత్మిక మలుపు.....

    చలం గారి స్త్రీవాదమూ, స్వేచ్ఛా, హిపోక్రసీనెదిరించే తత్వమూ, లెక్కలేనంత మందిని అతనికి శతృవులుగా మార్చాయి. ఈ విషయాలపై  చలం చివరి దశలో వున్నప్పడూ తీవ్ర పశ్చత్తాపపడ్డాడు. రచనల ను బూతు సాహిత్యంగా పరిగణించి వెలివేశారు.ఆ వెలి భరించలేకే ఆయన ఆంధ్రదేశం వదలి తమిళనాడులోని అరుణాచలంలో ఉన్న రమణ మహర్షి ఆశ్రమానికి కుటుంబంతోసహా వెళ్ళిపోయాడు. మొదటి నుంచి నాస్తికభావాలతో సతమతం అయ్యి దైవం పై అపనమ్మకం తో విప్లవాత్మక ఆలోచనలు వున్న చలం జీవితంలో చివరి దశలో ఆధ్యాత్మికత వైపు మొగ్గాడు. ఆయన నాస్తిక భావాల నుండి రమణ మహర్షి ఆశ్రమంలో ఆధ్యాత్మిక సంతృప్తిని పొందాడు. ఈ మార్పు ఆయన రచనల్లో కూడా కొంత ప్రతిఫలించింది, ముఖ్యంగా "చలం గీతాలు", "సుధ" వంటి రచనల్లో

    • విశ్లేషణ: చలం సాహిత్యం యొక్క ప్రత్యేకత....

    1. విప్లవాత్మక దృక్పథం.....

    చలం సామాజిక కట్టుబాట్లను, హిపోక్రసీని ప్రశ్నించిన తొలి తెలుగు రచయితలలో ఒకడు. ఆయన స్త్రీవాద ఆలోచనలు ఆనాటి సమాజంలో అసాధారణమైనవి.

    2. సాహిత్య శైలి...

    చలం భాషలో సౌందర్యం, సహజత్వం, భావోద్వేగ లోతు ఉన్నాయి. ఆయన వాక్యాలు పాఠకుల మనసును కదిలించేవి.

    3. సామాజిక సంస్కరణ....

    చలం రచనలు స్త్రీ స్వేచ్ఛ, సాధికారత, సామాజిక సమానత్వం వంటి ఆలోచనలను ప్రోత్సహించాయి. ఆయన రచనలు యువతను ఆలోచింపజేసి, సామాజిక మార్పుకు దోహదపడ్డాయి

    • మహా ప్రస్థానానికి ముందుమాట...

    చలం గారు శ్రీ శ్రీ వ్రాసిన "మహాప్రస్థానం"కు ముందుమాట వ్రాసాడు. మహాప్రస్థానం లోని రచనలకు దీటుగా ఈ ఉపోద్ఘాతం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమైంది. "యోగ్యతా పత్రం" అన్న శీర్షికతో వ్రాయబడిన ఈ ముందుమాట తెలుగు రచనలలో అత్యంత ప్రసిద్ధమైన ముందుమాటలలో ఒకటి. చలం మాటల్లో అంత శక్తి, వాడి (పదును) ఆలోచింపజేయగల శక్తి ఉన్నాయి. అందులో కొన్ని వాక్యాలు.....

    ఇది మహాప్రస్థానం సంగతి కాదు. ఇదంతా చెలం గొడవ. ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి (దీంట్లో మీ సెక్సుని ఉద్రేకించే సంగతులు ఏమీ లేవు) శ్రీ శ్రీ అర్ణవంలో పడండి. పదండి ముందుకు. అగాధంలోంచి బైలుదేరే నల్లని అలలు మొహాన కొట్టి, ఉక్కిరిబిక్కిరై తుఫానుహోరు చెవుల గింగురుమని, నమ్మిన కాళ్ళకింది భూమి తొలుచుకుపోతోవుంటే, ఆ చెలమే నయమని వెనక్కి పరిగెత్త చూస్తారు.
    ......
    శ్రీ శ్రీ కవిత్వమూ, పాల్ రోబ్సన్ సంగీతమూ ఒకటే రకం అంటుంది సౌరిస్. ఆరెంటికీ హద్దులూ, ఆజ్ఞలూ లేవు. అప్పుడప్పుడు లక్షణాలనూ, రాగాలనూ మీరి చెవి కిర్రుమనేట్టు ఇద్దరూ అరుస్తారు. ఏమీ రసం లేకుండా flat గా ఎక్కడికో, ఏమీ చేతగానివాళ్ళమల్లే జారిపోతారు. కాని ఆ అరుపుల్లో, చీకట్లో మొహాలూ, తోకలూ కనపడక వెతుక్కునే ప్రజల రొద, గాలిదెబ్బలకింద ఎగిరిపడే సముద్రపు తుఫాను గర్జనం, మరఫిరంగుల మరణధ్వానం, గింగురుమంటాయి. కంఠం తగ్గించి వినపడకండా తగ్గుస్థాయిలో మూలిగారా, దిక్కులేని దీనుల మూగవేదన, కాలికింద నలిగిన చీమల కాళ్ళు విరిగిన చప్పుడు, నీళ్ళులేక ఎండుతున్న గడ్డిపోచ ఆర్తనాదం వినిపింపజేస్తారు. బుద్ధి వున్నవాడెవ్వడూ అతనిది సంగీతమని కాని, ఇతనిది కవిత్వమని కాని వొప్పుకోడు; వొప్పుకోటమూ లేదు. ఎందుకంటే ఈ ఇద్దరి Appeal బుద్ధిని, వివేకాన్ని, కళాబంధనల్ని మించిన ఏ అంతరాళానికో తగులుతుంది -ఆ అంతరాళం అనేది వున్న వాళ్ళకి.

    . . . శ్రీ శ్రీ "ఆకలేసి" నక్షత్రాలు అదిరిచూసే "కేకలేశాడు. " ఈ కవికి ఆకలివేస్తే రా- గారి యింటికెళ్ళి శ్లాఘించి భత్యఖర్చు తెచ్చుకుని, భోజనం చేసి ప్రియురాలిమీద గీతం వ్రాశాడు.

    4. వ్యక్తిగత సంఘర్షణ....

    చలం జీవితం ఒంటరితనం, సామాజిక అవమానాలు, కుటుంబ సమస్యలతో నిండినది. ఈ సంఘర్షణలు ఆయన రచనల్లో ఆవేదన, తాత్వికతగా ప్రతిఫలించాయి

    చలం ప్రేమ విషయలాతో విసుగుచెంది భార్య రంగనాయకమ్మ క్షోభ పడింది. తర్వాత వదిన పెద్ద రంగనాయకమ్మ మరణించింది. అన్ని విధాలా అతడిని తెలుగు సమాజం వెలివేసింది. చలం విజయవాడలోని సొంత ఇంటిని ఫిబ్రవరి9, 1950లోనే అమ్మి అరుణాచలం లోని రమణమహర్షి ఆశ్రమానికి వెళ్లిపోయాడు. కానీ ఆయన రచనల మీద మమకారం తీరక అనేకమంది అక్కడకు వెళ్లి ఆయనను చూసి, మాట్లాడి వచ్చేవారు. చలం కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు నచ్చిన వాళ్లతో జరిపేవాడు. చివరకు ఆధ్యాత్మిక భావనలోని సౌందర్యంలో మునిగి మే4, 1979లో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.
    ......
    గుడిపాటి వెంకటాచలం ఒక సాహిత్య తుఫాను. ఆయన రచనలు సమాజాన్ని ఊపేసి, స్త్రీ స్వేచ్ఛ, సామాజిక సంస్కరణల గురించి కొత్త చర్చలను రేకెత్తించాయి. ఆయన జీవితం వివాదాలు, ఒంటరితనం, ఆధ్యాత్మిక అన్వేషణల మధ్య సాగినప్పటికీ, ఆయన సాహిత్యం తెలుగు సాహిత్య లోకంలో అమరత్వం సాధించింది. చలం రచనలు ఈ రోజు కూడా పాఠకులను ఆలోచింపజేస్తాయి, సమాజంలోని హిపోక్రసీని ప్రశ్నించే శక్తిని కలిగి ఉన్నాయి. ఆయన ఒక రచయితగా మాత్రమే కాక, సామాజిక సంస్కర్తగా, తాత్వికుడిగా తెలుగు సాహిత్యంలో శాశ్వత స్థానాన్ని సంపాదించారు.  
Skip to content
Open sidebar

ChatGPT
You said:
 చలం
స్త్రీ - చలం చేసినంత ఆలోచన ఇంకా ఎవరు చేయలేదు.( స్త్రీ - స్వేచ్చా - బాధ్యత, చలం దృష్టి లో విడదీయరాని అంశాలు )   

*మీరు చలాన్ని విమర్శించిన దానికన్నా ఎక్కువగా చలం తనని తాను విమర్శించుకున్నాడు.
చలాన్ని ఇవాళేదో ప్రత్యేకంగా నిర్వచించాలనీ కూడా కాదు, లేదా సమర్ధించాలని కూడా కాదు. కానీ గమనించండి మీరు, చలం వివాహ వ్యవస్థని నమ్మిన వాడు కాదు. దాన్ని ఆచరించిన వాడూ కాదు. తన కూతుళ్లకి ఎప్పుడూ ఆయన పెళ్ళి ఊసు తలపెట్ట లేదు సరికదా పెళ్ళిళ్ళు చేసుకోకండని వారితో చెప్పిన వాడు. తాను నమ్మిన వాటినే ఆయన ఆచరించి బతికాడు. వివాహవ్యవస్థ మీద తిరుగుబాటు చేసిన వ్యక్తిని మనం ఆ ప్రమాణాలతో చూసే వీలు లేదు. చలం రాసిన వాటిని మీరు ఒప్పుకోకపోవచ్చు. చలాన్ని మీరు విమర్శించవచ్చు. కానీ చలం ఒక గృహస్తు లాగా బతకడానికో, అలాంటి ఒక విషయాన్ని “ఆదర్శం” గా చూపించడానికో ఏనాడూ ప్రయత్నం కూడా చేయలేదు. అందుకోసం ఆయన తన రచనలు చేయలేదు. 

 ఆయన వెనకటి రచనల ప్రస్తావన చెసినప్పుడు చలం మళ్ళీ ఆ రచనలనే చేయవలసి వస్తే అంతకన్నా మరింత ఘాటుగా ఎలా రాయాలా అని ఆలోచిస్తానని అన్నాడు! అలాంటి వారితో కలిసి జీవించడం ఆయన భార్యకి అంత సులువైన విషయమేమీ కాదు, నిజమే. అయినా, ఆవిడ మీరు ఆశించినట్టు గా ఎందుకని “విముక్తి” అనుకుంటూ ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోలేదో! మీరు చూడని అంశమేదో ఆమె తన భర్తలో బహుశా చూడగలిగిందేమో మరి! లేకపోతే రంగనాయకమ్మ గారు అన్నేళ్ళు చలంతో సహజీవనం చేయగలిగేది కాదు కదా?
మీరు చలాన్ని విమర్శించిన దానికన్నా ఎక్కువగా చలం తనని తాను విమర్శించుకున్నాడు. ఆయన తన ఆత్మకధని మొదలుపెడుతూ అన్న మాటలని ఎప్పుడైనా చదివిచూడండి. ఆయన అభిప్రాయాలు ఆయన రాసిన “బిడ్దల శిక్షణ” లోనీ “స్త్రీ” లోనీ ఆయన ఆత్మకధ లోనీ స్పష్టం గానే ఉన్నాయి.
చలం వివాదాస్పదం కావడానికి ఆయన “శృంగారం” గురించి రాయడం కారణం కాదు. చలం కన్నా ముందు తెలుగు సాహిత్యం నిండా ఉన్నది శృంగారమే!! వాటిని ఎవరూ తిట్టలేదేం? ఎందుకంటారూ?? ఎందుకంటే వాటి పాఠక వర్గం లో స్త్రీలు లేరు. కనీశం స్త్రీలు ఉండొచ్చును అన్న స్పృహ కూడా ఆ ప్రాచీన “శృంగార” రచయితలకి లేదు. ప్రాచీనమేం ఖర్మ ఆధునిక రచయితలకీ చాలామందికి లేదు. ఆనాటి రచనలన్నీ పురుషుల కోసం పురుషులు రాసుకున్న శృంగార రచనలు. కొద్దో గొప్పో స్త్రీలు రాసినా వారు కూడా ఆ శృంగార చట్రాన్నే ఒప్పేసుకుని ఆ తరహాలోనే తాము సైతం రచించిన శృంగారం! కానీ చలం రచనల్లోని స్త్రీపురుష సంబంధాలు అంతకు మునుపటి రచనలలో లేనివి. స్త్రీల అనుభవం గురించిన ఆలోచనలని తొలిగా సాహిత్యంలో ప్రస్తావన చేసిన రచయిత వెంకటచలంగారే ! ఆయన రాసిన వాటిని బాహాటంగానో, రహస్యంగానో ఎలాగో అలాగ ఆయన కాలం నాటి స్త్రీలు మాత్రం స్వయంగా చదివారు. చదవడమే కాదు వాటిని వారు నచ్చుకున్నారు. ఆ రాసిన వ్యక్తిని కలవడానికీ ఆయనని చూడడానికీ ఆయనతో మాట్లాడడానికీ తెలుగు సమాజం లోని స్త్రీలు స్వతంత్రించి ధైర్యంగా ప్రయత్నం కూడా చేశారు. దీనినే “ప్రభావితం కావడం” అని అంటారు. ఇలా కేవలం “శృంగారం” రాయడం మాత్రమే కాక ఆయా స్త్రీలు మోస్తున్న కుటుంబవ్యవస్థ లోని లోటుపాట్లని చలం బయట పెట్టడం వలన, వాటిని చదివిన ఆడవాళ్ళు ఎక్కడ కుటుంబాలని వదిలి వెళ్ళిపోతారో అని తెలుగు సమాజం కలత చెంది చలాన్నీ, అతని రచనలనీ నిందించడం జరిగింది. కానీ పాపం! ఏదీ? చలం రచనలని చదివి ఏ భార్యా కుటుంబాలని వదిలి వెళ్ళిపోలేదు. చివరికి చలం భార్యతో సహా :)
rama bharadwaj వారి సౌజన్యంతో 

In to english
ChatGPT said:
Here is the English translation of your powerful and nuanced Telugu passage on Chalam:

Chalam
No one has thought about women as deeply as Chalam did. (Woman – Freedom – Responsibility: In Chalam’s view, inseparable elements)

More than anyone else criticizing Chalam, it was Chalam himself who criticized his own thoughts the most.

There is no need to redefine Chalam today or to justify him. But we must observe this – Chalam neither believed in the institution of marriage nor did he practice it. He never brought up the topic of marriage with his daughters; in fact, he explicitly told them not to marry. He lived by what he believed. When someone has revolted against the institution of marriage itself, we cannot judge him by those same traditional standards.

You may disagree with what Chalam wrote. You may even criticize him. But Chalam never tried to live like a typical householder, nor did he try to portray that kind of life as an ideal. That’s not what his writings were for.

Whenever his earlier works were mentioned, Chalam would say that if he were to write them again, he would do so in even stronger terms! It’s true that living with such a person wouldn’t have been easy for his wife. Even so, why do you think she didn’t leave the house and seek her “freedom,” as you might have expected? Maybe she saw something in her husband that you didn’t. Otherwise, why would someone like Ranganayakamma live with Chalam in companionship for so many years?

More than you criticized Chalam, he criticized himself. If you ever read how he began his autobiography, you’ll understand that. His views are very clearly expressed in Biddaala Shikshana (“Children’s Education”), in Sthree (“Woman”), and in his autobiography.

Chalam didn’t become controversial just because he wrote about sexuality. Telugu literature before Chalam was filled with erotic content! Yet no one criticized those earlier writers. Why do you think that is? Because their readership never included women. In fact, those ancient writers didn’t even imagine that women might read their works. Not just ancient writers—even many modern writers lacked that awareness. All those erotic works were written by men, for men. And even when women did write, they accepted that same framework and contributed to it in the same manner.

But Chalam’s portrayal of male-female relationships was something entirely new. He was the first writer to bring women’s real experiences into Telugu literature. Women of his time, openly or secretly, read what he wrote. Not only did they read his works—they connected with them. They even made efforts to meet him, to see him, to speak with him. That is what we call “influence.”

It wasn’t just that he wrote about sexuality. He exposed the flaws within the family structure that women were burdened with. Because of this, society grew anxious that women, after reading his works, might abandon their families. So they criticized Chalam and his writings. But ironically, not a single woman left her home because of reading Chalam. Not even Chalam’s own wife!

Courtesy: Rama Bharadwaj

Let me know if you'd like this translated back into a poetic or literary style, or used in an article or blog post.

You said:
Blog post
ChatGPT said:
Here is a polished blog post version of your content, maintaining the essence of your original Telugu writing while presenting it in clear, engaging English:

Chalam – A Rebel Mind, A Free Spirit
No one has thought about women as deeply as Chalam did.
(Woman – Freedom – Responsibility: In Chalam’s view, these are inseparable.)

When it comes to Chalam, there's little need to define or defend him anew. In fact, no one criticized Chalam as harshly or as often as he criticized himself. His writings, his life, his philosophy — all were deeply introspective and radically honest.

Chalam did not believe in the institution of marriage. More importantly, he didn’t just preach — he practiced what he believed. He never urged his daughters to marry. On the contrary, he told them not to. His life was an embodiment of the ideals he held close, regardless of societal approval.

To judge a man who rejected marriage itself by the standards of traditional domestic life is to miss the point entirely. You might disagree with Chalam. You might even criticize him. But let us be clear — Chalam never attempted to live as a “model householder.” His intent was never to portray an ideal family life in his writings. His aim was liberation — especially for women — from societal constructs that shackled their minds and bodies.

When questioned about his earlier writings, Chalam once said, “If I had to write them again, I’d write them even more sharply.” Living with a man like Chalam could not have been easy for his wife. And yet, she never walked out in search of “freedom” as many might expect. Perhaps she saw something in him that others missed. After all, a strong and conscious writer like Ranganayakamma lived with Chalam for many years in companionship — not out of submission, but choice.

More than any outsider, Chalam subjected himself to scrutiny. Read the opening lines of his autobiography, and you’ll see the self-examination that permeated his work. His thoughts on education, on womanhood, on individual freedom — in Biddaala Shikshana, Sthree, and his autobiography — remain strikingly relevant.

Contrary to common belief, it was not Chalam’s focus on sexuality that made him controversial. Erotic content existed in Telugu literature long before Chalam. Yet, no one criticized those earlier writers. Why? Because their readership was exclusively male. Those authors never considered that women might be readers too.

Even when women wrote, they conformed to the same male gaze and narrative frameworks.

But Chalam disrupted that.

He centered women's experiences in his narratives — not just as muses, but as individuals with their own desires, struggles, and intellect. Women read his work. They didn’t just read it — they resonated with it. Many sought to meet him, talk to him, understand him. That is the power of real influence.

Chalam didn’t merely write about sexuality — he wrote about the structural inequities women endured within the family system. It was this that unsettled society. There was fear that women, after reading Chalam, might break free from their homes and families.

But ironically, no woman abandoned her family because of Chalam’s books.

Not even his own wife.

Courtesy: Rama Bharadwaj

04.చలం 🌐


" స్త్రీకి కూడా శరీరం వుంది!"

చదవండి!

" ప్రజలు అధర్మాలూ, అవినీతులూ అనేవి
చాలా...వాళ్ళకి...ఏ పనులు చెయ్యడానికి 
ధైర్యం లేదో అవి ఐ వుంటాయి.వాటిని
సమర్ధించుకోటానికి శాస్త్రాలని సాక్ష్యం 
తెచ్చుకుంటారు.తమకి ఇష్టమైనవి శాస్త్రాలు నిషేధించినా చెయ్యడం మానరు!"

" వొరే! ఇట్లాంటి వాళ్ళు నీకే కనబడతారేంరా!ఇంతదేశం తిరిగే మాకు
కనబడరేం?"

అని కొంచెం అపనమ్మకం గొంతుకతో
అడిగాడు.సహృదయుడు, తేటనీటి
మనసున్నవాడు,నా మాటలో వేదవాక్యం
వంటి విశ్వాసమున్నవాడు పంతులు.ఇంక
తక్కినవాళ్ళు నమ్ముతారా!నేను నా
ఆవేశాన్ని దిగమింగుకోలేక పోయినాను.

" ఉన్నారు.నీ చుట్టూ, ప్రతిచోటా ప్రతి
రోడ్డుమీదా ఉన్నారు.ఆ దృష్టి లేదు నీకు!
పలకరు, చెప్పుకోరు, ముందుకు రారు.
గాయపడ్డా నెత్తురు మళ్ళీ కారుతుందని
భయం.వాళ్ళకా?అందం ఎప్పుడో పోయివుంటుంది.హృదయ సౌకుమార్యం 
ఈ ప్రపంచం కాళ్ళకిందపడి ఎప్పుడో
నలిగి వుంటుంది.భరించలేవు వాళ్ళని
దగ్గరగా.కాని ఆ మలినంలోంచి, ఆ దీనత్వంలోంచి, ఆ మౌనంలోంచీ-
ఎక్కిరిస్తావా, అవిశ్వాసంతో చూశావా,
గట్టిగా ప్రశ్నించావా,మాట్లాడకుండా గుంపులో కలిసిపోతారు!"

" మనిషిని చూస్తే మనిషికి లోపల్నించి
స్నేహభావం,పెట్టిన అన్నం ఆకలి తీరుస్తో
వుంటే,కుక్కకి గానీ,కుంటికి గాని,తృప్తి.తనకి ప్రతిగా కాలంలో నిలిచే
సంతతిని చూసి హృదయానికి పట్టిన గర్వం, తన ఇరుకు తప్పించి విశ్వవిశాలత్వంతో కలిసి గానం చేసే
ఆత్మసంయోగం-వీటన్నిటికీ అంధులౌతున్నారు.శాంతీ, స్థిమితమూ
లేకండా ఎగబాకడం, కూడబెట్టడం,
ఖర్చులోనే గొప్ప పడడం.ఒకటే ఆరాటం.
ఇటూ అటూ చూసి, గొప్పగొప్పpossesion. సౌఖ్యానికి,ఉత్త
possession ముఖ్యమైపోయింది.
కట్టిన ఇల్లు తనకి సౌఖ్యమివ్వడానికి కన్న ఇతర్లకి చూపి ఈర్ష్య పెట్టడానికి...."

" హృదయంలోంచి వెన్నెలని సృజించుకోలేని మానవుడు దురదృష్టవంతుడు!"

" ఈ ఊళ్ళో మనిషికి పెద్ద జబ్బుచేస్తే,
ఆ జబ్బుకి వైద్యానికన్న చచ్చింతర్వాత
కర్మలు వైభవంగా చెయ్యడానికి ఖర్చు పెడతారు.బతికివున్న పిల్లల కడుపుకొట్టి 
చచ్చిన మనుషులకు ఊరేగింపులు
జరుపుతారు.ఊరందరికీ భోజనాలు
పెడతారు.అది ప్రతిష్ఠ.ఈ మూర్ఖుల్లో
అసహ్యించుకునే గుణం దేశం మొత్తంమీద వివేకవంతుల్లో కనబడేప్పటికి, ఆగి ఆలోచించవలసి వొస్తుంది.మనిషి తన ప్రతిష్ఠ కోసం నిత్యం 
పడే యాతనకంటె ఎక్కువగా, దేశ ప్రతిష్ఠ 
కోసం రాజ్యాధిపతులు పడుతోంటే సంస్కారం, విద్యాజ్ఞానం అంటామే వాటి
విలవల మీద గట్టి సందేహం కలుగుతోంది!"

" ఎవరినన్నా క్షమిస్తుందిగాని లోకం, నిద్రలోంచి లేచి అందాలు చూడమనే
ఆర్టిస్టునీ, చావులోంచి లేచి ఆనందంలో
బతకమనే ప్రియుణ్ణీ క్షమించదు.తమ నుంచి తీసుకునే వాళ్ళమీద వున్న ఇష్టం,
తమకి ఇచ్చేసుకునే వాళ్ళమీద వుండదు.
ముఖ్యంగా వాస్తవాన్నీ, శక్తినీ, జీవితాన్ని 
పంచిపెట్టే వాళ్ళమీద అమితమైన ద్వేషం!"

" పిల్లలు -ఉత్తనెత్తురు,ఎదిగే ఎముకలు,
ఆతృతతో విశ్వాసంతో నిండిన చూపులు,
ముద్దుమాటలూ,అర్ధంలేని అల్లరీ,
నిష్కపటమైన మనసులూ-చవక,
అతి చవక-పిల్ల చస్తే పిల్లను కనడం సులభం.పురుగులమల్లే లోకమంతా పిల్లలు-ఎన్ని కోట్లు-ఏమైతేనేం-బాధ ఏమిటో,ఎందుకు కలుగుతుందో తెలుసుకోలేని పాపలు.బలపం పట్టుకొని,
తలవొంచుకుని ఐదుగంటలు....ఒక వంకర
గీత మీద అట్లా రుద్దుతూ, ఒక్క అక్షరాలేమిటి,సమస్తమున్నూ,టీచర్ల ప్రశ్నలూ,ఈ దరిద్రగొట్టు ఇనస్పెక్టర్ల తనిఖీలూ-అంత నవ్వు రాకపోతే,ఈ కోపమే దహించకపోతే-ఏడుద్దును!"

" ఎంత చదువుకున్నా,ఎన్ని పరీక్షలు గట్టెక్కినా, తాము చదివింది వంటపట్టించుకుని ఏ విషయమైనా
ఒరిజినల్ గా మాట్లాడగల స్త్రీలు చాలా తక్కువ! మాటలు విన్నా ఉపన్యాసాలు 
విన్నా ఉత్త చిలకపలుకులు.అసలు జన్మవల్ల సంస్కారం కలిగిన స్త్రీలున్నారు
గొప్పవారు,పల్లెటూళ్ళలో.కాని చదివి
గొప్పవారైన స్త్రీలు ఈ దేశంలో లేనట్లున్నారు.మళ్ళీ చదువువల్ల చక్కని 
పాలిష్ వచ్చిన పురుషులున్నారు."

" పశ్చిమ ఖండాలుట!ద్వేషాలుట!
ఆటంబాంబులట!ధ్వంసంట!వీళ్ళూ
వెక్కిరించడం!వాళ్ళేదో దారుణాస్త్రాలు
తయారుచేసుకుని,చంపుకోనన్నా 
చంపుకుంటున్నారు.ఊరికే,ఇళ్ళల్లో,గుంటల్లో పురుగుల్లాగు కులకులమని మురిగి చచ్చే, పిల్లల్ని కంటో,బైట జబ్బలు 
చరుచుకుంటో,యోధాను యోధులమంటో,జయ్ జయ్ అని వీధులంతా అర్ధం లేకుండా అరుస్తో,
కలకాలం ఏ రోగమో పడేసి పీల్చేసి
చంపిందాకా చిరకాలం బతికి వీరందరూ
చేస్తున్న మహాకార్యమేమిటి?
సంవత్సరానికి ఓ కోటి జనసంఖ్య పెరగటం తప్ప!"

" ఈనాటి ప్రజలు క్రమంగా ప్రతి అనుకూలం కోసమూ ప్రభుత్వాలమీద
ఆధారపడటమూ,ప్రభుత్వాలు ప్రజల
జీవితాల్లో కలగచేసుకుని నిర్ణయించడమూ జరుగుతోంది.ప్రజల బాహ్యక్షేమానికి చాలా ఉపకారాలు
నానాటికీ హెచ్చుగా కలుగుతున్నట్లు కనబడ్డా,లోపల లోపల కనపడకుండా
వ్యక్తిస్వాతంత్ర్యం హరించిపోతో వుంటుంది.ప్రభుత్వం మీద బాగా
ఆధారపడటం వల్ల,తప్పు అంటే ప్రభుత్వానికి కోపం తెప్పించడమే అనే
దానికింద తేలుతుంది.అసలు ధిక్కరించే
తిరుగుబాటూ,స్వతంత్రంగా యోచించే
శక్తీ, చాలా నాజూకుగా, నొప్పి లేకుండా
తెలీకుండా లాగేస్తున్నాయి ప్రభుత్వాలు.
ఈ పద్ధతికి చాలా పెద్దపేర్లు పెడతారు-
విద్యా,సంస్కృతీ, లా, ఆర్డర్, దేశానికి
ఉపద్రవ రక్షణా ఇట్లాంటివి.
ప్రజలకి తిరగబడవలసిన అగత్యం
తక్కువౌతోంది.కాని తిరగబడ్డారా,
సర్వవిధాల నాశనమే.చంపనక్కరలేదు.
ప్రభుత్వాన్ని ధిక్కరించిననాడు బియ్యం 
దొరకవు.పంపులో నీళ్ళు రావు!"
చలం

చలం రచనలలో ఫ్రాయిడ్ ప్రభావం: 
ప్రేమ, మోహం, కామం
తెలుగు సాహిత్యంలో ఒక విప్లవాత్మక ఉద్యమానికి తెరతీసిన రచయిత చలం. ఆయన రచనలు ఒకవైపు సాంప్రదాయ సామాజిక విలువలపై ప్రశ్నలు వేస్తే, మరోవైపు వ్యక్తిగత భావోద్వేగాలను, మానసిక స్వేచ్ఛను అవగాహన చేసుకునే ఆవశ్యకతనుప్రతిపాదించాయి.
చలం రచనలలో ప్రేమ, మోహం, కామం వంటి భావాలు కేవలం కథా అంశాలుగాక, తాత్వికంగా విశ్లేషించదగ్గ అంశాలుగా మారతాయి. ఈ విశ్లేషణలో మనం చలం రచనలపై ఫ్రాయిడ్ సైకాలజీ ప్రభావాన్ని పరిశీలిస్తాం.

ఫ్రాయిడ్ ప్రభావం

అవచేతన మనస్సు
Subconscious Mind

The subconscious mind refers to the part of the mind that is not currently in focal awareness but still influences thoughts, feelings, and behavior. It stores past experiences, memories, beliefs, and emotions that may not be in active thought but can affect decisions and actions.

అవచేతన మనస్సు అనేది మనకు ప్రస్తుతంగా తెలుసు అన్న భావజాలంలో ఉండకపోయినా, అది మన ఆలోచనలు, భావాలు, ప్రవర్తనలపై ప్రభావం చూపుతుంది. ఇది గత అనుభవాలు, జ్ఞాపకాలు, నమ్మకాలు మరియు భావోద్వేగాలను నిల్వ చేస్తుంది. అవి మన చైతన్యంలో లేకపోయినా, మన నిర్ణయాలపై మరియు ప్రవర్తనపై ప్రభావం చూపవచ్చు.

Libido అనేది ఒక లాటిన్ పదం, దీని అర్థం "ఆసక్తి" లేదా "తృష్ణ".

Libido refers to a person’s sexual drive or desire. It is the natural energy or instinct related to sexual urges, often discussed in psychology, especially in Freud’s psychoanalytic theory, where it is seen as a primary source of human motivation.

లిబిడో అనగా ఒక వ్యక్తిలో ఉండే లైంగిక ఆకాంక్ష లేదా కామావేశం. ఇది సహజమైన శక్తి లేదా వాంఛ, ముఖ్యంగా మానసికశాస్త్రంలో ఫ్రాయిడ్ సిద్ధాంతంలో, ఇది మానవ ప్రవర్తనకు ప్రాథమిక ప్రేరణగా చెప్పబడింది.
సిగ్మండ్ ఫ్రాయిడ్ "అవచేతన మనస్సు", "లిబిడో", "ఇడిపస్ కాంప్లెక్స్" వంటి భావనలతో మానవ వ్యక్తిత్వాన్ని విశ్లేషించాడు. చలం రచనల్లో ఈ భావజాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. “మైదానం” నవలలో కథానాయిక తన స్వేచ్ఛ కోసం సమాజ విలువలతో పోరాటం చేస్తుంది. ఇది ఫ్రాయిడ్ “ఇగో - సుపరీఇగో” సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తుంది.

ప్రేమ - ఒక విముక్తి తత్వం
చలానికి ప్రేమ అనేది బంధనాల కంటే విముక్తికి మార్గం. ఆయన ప్రేమను శరీర సంబంధానికి పరిమితం చేయలేదు. ప్రేమ అనేది సమాజ నియమాలకు భిన్నంగా అన్వేషించాల్సిన స్వేచ్ఛతో కూడిన అనుభూతిగా చూశాడు.

మోహం - బానిసత్వానికి ప్రతీక
మోహం వ్యక్తిని బానిసగా చేస్తుంది. చలం రచనలలో మోహానికి గురైన వ్యక్తి తన స్వేచ్ఛను కోల్పోతాడు. 

కామం - ప్రకృతిసిద్ధమైన అనుభూతి
చలం కామాన్ని సహజమైన భావంగా గుర్తించి దాన్ని అణచడాన్ని తప్పుబట్టాడు. “మైదానం”, వంటి రచనలలో శారీరక భావాలు నిర్మొహమాటంగా వ్యక్తీకరించాడు.

ముగింపు
చలం రచనలు ప్రేమ, మోహం, కామం వంటి భావజాలాలను కేవలం కథా అవసరాలకు మాత్రమే పరిమితం చేయలేదు. అవి వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక విమర్శకు పునాది వేశాయి. ఫ్రాయిడ్ ప్రభావం చలం గారి రచనల్లో కనిపిస్తుంది. చలాన్ని తాత్వికుడిగా గౌరవించవచ్చు.
Collection
- CH Ramamohan, B.A.

10.చరిత్ర హంపీ చరిత్ర@

హంపీ చరిత్ర – విజయనగర సామ్రాజ్యం

హంపీ అనేది కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్ర నదీ తీరాన ఉన్న ఒక ప్రాచీన నగరం. ఇది విజయనగర సామ్రాజ్యం రాజధానిగా ఉండింది. ఈ నగరం 14వ శతాబ్దంలో హరిహర మరియు బుక్క అనే వారు స్థాపించిన విజయనగర సామ్రాజ్యానికి కేంద్రంగా అభివృద్ధి చెందింది.

చారిత్రక విశేషాలు:
హంపీ నగరం 1336లో ఏర్పడింది. ఇది ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరాల్లో ఒకటిగా చెప్పబడేది.

కృష్ణదేవరాయులు పాలనలో హంపీ అత్యున్నత స్థితికి చేరింది. ఆయన హంపీకి మేధాసంపత్తిని, కళను, సైనిక శక్తిని తెచ్చారు.

హంపీలో ఉన్న విట్టల దేవాలయం, విజయ విఠల ఆలయంలోని సంగీత స్తంభాలు, హజార రామాలయం, లోతస మహల్, స్టోన్చెరియట్ వంటి కట్టడాలు శిల్పకళకు నిదర్శనాలు.

పతనం:

1565లో తాళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఓడిపోయింది. అనంతరం హంపీ నగరం బాగా నాశనం చేయబడింది.

ప్రస్తుతం:
హంపీ యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించబడింది. ఇది భారతీయ సంస్కృతి, కట్టడకళ, శిల్ప సంపదకు ప్రతీకగా నిలిచింది. హంపీ పర్యటన ద్వారా భారత గర్వకారణమైన చరిత్రను అనుభవించవచ్చు.

హంపి రాజుల వంశావళి

సంగమ వంశం 

(1336–1485)

రాజు పేరుపాలన సంవత్సరాలు
హరిహర I1336–1356
బుక్కా I1356–1377
హరిహర II1377–1404
విరూపాక్ష రాయ I1404–1405
బుక్కా II1405–1406
దేవరాయ I1406–1422
రామచంద్ర రాయ1422
వీర విజయ బుక్కా రాయ1422–1424
దేవరాయ II1424–1446
మల్లికార్జున రాయ1446–1465
విరూపాక్ష రాయ II1465–1485
ప్రౌఢ రాయ1485

సాళువ వంశం 

(1485–1505)

రాజు పేరుపాలన సంవత్సరాలు
సాళువ నరసింహ1485–1491
తిమ్మ భూపాల1491
నరసింహ రాయ II1491–1505

తుళువ వంశం 

(1491–1570)

రాజు పేరుపాలన సంవత్సరాలు
తుళువ నరస నాయక1491–1503
వీర నరసింహ రాయ1503–1509
కృష్ణదేవరాయ1509–1529
అచ్యుత దేవరాయ1529–1542
వెంకట I1542
సదాశివ రాయ1542–1570

అరవీడు వంశం 

(1542–1646)

రాజు పేరుపాలన సంవత్సరాలు
అలియ రామ రాయ1542–1565
తిరుమల దేవరాయ1565–1572
శ్రీరంగ I1572–1586
వెంకటపతి రాయ (వెంకట II)1586–1614
శ్రీరంగ II1614
రామ దేవరాయ1617–1632
వెంకట III1632–1642
శ్రీరంగ III1642–1646