వరాహమిహిరుడు (సా.శ. 499)
వరాహమిహిరుడు భారతదేశపు ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త, జ్యోతిష పండితుడు. చంద్ర గ్రహణాలు రాహు, కేతువుల వల్ల కాక భూమి నీడ చంద్రునిపై పడటం వల్ల కలుగుతాయని వివరించాడు.
అలాగే సూర్య గ్రహణం చంద్రుని నీడ భూమిపై పడటం వల్ల సంభవిస్తుందని పూర్వ ఋషులు చెప్పిన సత్యాన్ని స్పష్టంగా తెలియజేశాడు. ఇది ఆయన శాస్త్రీయ దృష్టికి గొప్ప ఉదాహరణ.
తోకచుక్కలు మరియు వాటి రకాల గురించి కూడా వరాహమిహిరుడు వివరించాడు. ప్రకృతి, ఖగోళ ఘటనలపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన ఈ రచనల ద్వారా తెలుస్తుంది.
అనేక సందర్భాలలో గర్గ, పరాశర, అసిత దేవతల, కశ్యప, బృగు, వసిష్ట, మను, మయ వంటి ప్రాచీన ఋషుల అభిప్రాయాలను గౌరవంగా ప్రస్తావించాడు. ఇంకా “అన్యాన్ బహున్” అని చెప్పడం ద్వారా అనేకమంది పూర్వాచార్యులను అనుసరించినట్లు తెలుస్తుంది.
ఇది ఆయన పరిశీలనాత్మక దృష్టి, వినయం, జ్ఞాన సంపదకు నిదర్శనం. ఆ కాలంలో పూర్వ గ్రంథాలు, సిద్ధాంతాలు అందుబాటులో ఉండేవని కూడా తెలుస్తుంది.
హిందూ కాలగణన
హిందూ కాలగణన (Hindu Calendar) కాలక్రమేణా అనేక మార్పులు చెందింది. ఫలితంగా ప్రస్తుతం వివిధ ప్రాంతీయ కాలగణనా విధానాలు ఉన్నాయి.
అధికంగా హిందూ కాలగణన సూర్య సిద్ధాంతం ఆధారంగా ఉంది. ఇది సుమారుగా సా.శ. 3వ శతాబ్దానికి ప్రామాణికంగా రూపొందినట్లు భావిస్తున్నారు.
సూర్య సిద్ధాంతం వేదాంగాలలో ఒకటైన జ్యోతిషశాస్త్రానికి చెందిన ప్రముఖ గ్రంథంగా పరిగణించబడుతుంది.